Nitin Gadkari: ఎండల ధాటికి ఎన్నికల ర్యాలీలో కుప్పకూలిన నితిన్ గడ్కరీ..

Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఉన్నట్లుండి ఎన్నికల వేదికపైనే కుప్పకూలారు. వేసవి వేడి ధాటికి గడ్కరీ స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయనకు చికిత్స అందించడంతో కాసేపటి తర్వాత కోలుకున్నారు. తర్వాత మళ్లీ వేదికపైకి వచ్చి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటన మహరాష్ట్రలోని యావత్మాల్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగింది. తన ప్రసంగాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా గడ్కరీ ట్వీట్ చేశారు.

Read Also: IPL 2024: అంత మంది సీఎస్కే ఫ్యాన్స్ మధ్య ఆ ‘ఒక్కడు’.. ఇది కదా ఎంజాయ్ అంటే..!

‘‘మహారాష్ట్రలోని పుసాద్‌లో జరిగిన ర్యాలీలో వేడి కారణంగా నేను అసౌకర్యానికి గురయ్యాను. కానీ ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను మరియు తదుపరి సమావేశానికి హాజరయ్యేందుకు వరుద్‌కు బయలుదేరుతున్నాను. మీ ప్రేమ మరియు శుభాకాంక్షలకు ధన్యవాదాలు’’ అని పోస్ట్ చేశారు. గడ్కరీ నాగ్‌పూర్ నుంచి 2014, 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఈ సారి కూడా అక్కడి నుంచే పోటీ చేశారు. తొలివిడతలో నాగ్‌పూర్ ఎంపీ స్థానానికి ఎన్నికలు ఏప్రిల్ 19న ముగిశాయి.

ప్రస్తుతం ఆయన శివసేన(ఏక్‌నాథ్ షిండే) అభ్యర్థి రాజశ్రీపాటిల్ తరుపున ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయన యావత్మాల్-వాషిమ్ ఎంపీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన(ఏక్‌నాథ్ షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి ‘మహాయుతి’గా పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్) మహా వికాస్ అఘాడీ కూటమిగా పోటీ చేస్తోంది. రెండో దశ ఏప్రిల్ 26న అమరావతి, హింగోలి, నాందేడ్, యావత్మాల్-వాషిమ్‌తో సహా మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతంలోని ఎనిమిది ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది.