E20 Fuel: ఈ20 ఇంధనంపై విమర్శలకు గడ్కరీ కౌంటర్.. ఏమన్నారంటే..!

  • ఈ20 ఇంధనంపై విమర్శలకు గడ్కరీ కౌంటర్
  • ఇంజిన్ దెబ్బతింటుందన్న విమర్శలకు సవాల్
  • కుళ్లిన పండ్లు, కూరగాయలతోనూ ఇథనాల్ తయారు చేయొచ్చని వెల్లడి
Nitin Gadkari

Nitin Gadkari

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ20 ఇంధన విధానంపై వస్తున్న విమర్శలకు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి గట్టిగా స్పందించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారత్ దిగుమతి ఇంధనంపై ఎంతగా ఆధారపడుతోందో మరోసారి స్పష్టం చేశాయని పేర్కొన్నారు. దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే అంతిమ లక్ష్యమని చెప్పారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. భారత్ భవిష్యత్తులో బయోఫ్యూయల్స్, హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల నుంచి ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం దేశ ఆర్థిక, వ్యూహాత్మక భద్రతకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ఇంధన దిగుమతులపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో చూపించిందని… ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ భారత్ సాధించడమే తమ లక్ష్యమని గడ్కరీ తెలిపారు.

కుళ్లిన పండ్లు, కూరగాయలతోనూ..

ఇథనాల్ ఉత్పత్తి కోసం ఆహార పంటలను వినియోగించడం వల్ల ఆహార భద్రత దెబ్బతింటుందనే విమర్శలను గడ్కరీ ఖండించారు. ‘‘కొంతమంది ఇథనాల్ అంటే కేవలం ఆల్కహాల్ అని మాత్రమే భావిస్తున్నారు. కానీ ఇథనాల్‌ను అనేక రకాల ముడి పదార్థాలతో తయారు చేయవచ్చు. కుళ్లిపోయిన పండ్లు, కూరగాయలతో కూడా ఇథనాల్ ఉత్పత్తి సాధ్యమే.’’ అ స్పష్టం చేశారు. దేశం ఇంధన స్వయం సమృద్ధి సాధిస్తే ఇంధన భద్రత పెరగడమే కాకుండా కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ఈ20 పెట్రోల్ వాడితే వాహనాలు దెబ్బతింటున్నాయన్న ప్రచారాన్ని గడ్కరీ కొట్టిపారేశారు. ఈ20 ఇంధనం పాత, కొత్త వాహనాల రెండింటికీ సురక్షితమేనని స్పష్టం చేశారు.

‘‘ఈ20 ఇంధనం వల్ల వాహనాలకు ఎలాంటి నష్టం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని విమర్శలు వాస్తవాల కంటే రాజకీయ ఉద్దేశాలతోనే వస్తున్నాయి.’’ అని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు కూడా గడ్కరీ ఇదే అంశంపై స్పందిస్తూ.. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ఎవరి వాహనం దెబ్బతిన్నా సంబంధిత డీలర్‌తో పాటు తన మంత్రిత్వ శాఖకు కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘‘ఇథనాల్ కారణంగా వాహనం దెబ్బతిన్నట్లు ఎవరైనా నిరూపిస్తే దర్యాప్తు చేసి తగిన పరిహారం అందిస్తాం. మీకు వ్యక్తిగతంగా తెలిసిన ఇద్దరి పేర్లు అయినా చెప్పగలరా.. ఇథనాల్ వల్ల వారి వాహనాలు దెబ్బతిన్నాయని?.’’ అంటూ విమర్శకులకు గడ్కరీ సవాల్ విసిరారు.