NCERT: 9వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకాన్ని NCERT సవరించింది. సవరించిన పుస్తకంలో ఫ్రెంచ్ విప్లం, రష్యా విప్లవం, నాజీయిజం ఎదుగుదల వంటి ప్రపంచ చరిత్రకు సంబంధించిన అధ్యాయానాలు తొలగించింది. వీటిని ఇకపై 10వ తరగతిలో పాఠ్యాంశాలుగా బోధించనున్నారు. దీనికి బదులుగా భారతీయ చరిత్ర, నాగరికత, జ్ఞాన వ్యవస్థలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త పుస్తకంలో ‘‘అండర్స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’’ అనే అధ్యాయం ద్వారా మానవ పరిణామ క్రమం, వేటాడే జీవితం నుంచి వ్యవసాయం వరకు జరిగే మార్పులు, మెసపటోమియా, హరప్పా, ఈజిప్ట్, చైనా నాగరికతలకు వివరించింది.
ఇదే కాకుండా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం వంటి నాలుగు వేదాల పరిచయం, వారి ముఖ్య ఉద్దేశాలను కూడా విద్యార్థులకు తెలియజేసేలా సిలబస్ రూపొందించారు. వర్ణ, జాతి వ్యవస్థల పరిణామం గురించి ప్రత్యేక అధ్యాయం చేర్చారు. ప్రారంభ వైదిక కాలంలో సామాజిక హోదా పుట్టుక ఆధారంగా కాకుండా వృత్తి, ప్రాంతం, భాష, కుటుంబ సంబంధాల వంటి అనేక అంశాలపై ఉండేదని పేర్కొంది. వృత్తుల్లో కూడా అప్పటి వారసత్వం స్థిరపడలేదని వివరణ ఇచ్చారు.
క్రీస్తుపూర్వం 6వ-4వ శతాబ్ధాల మధ్య భారతదేశంలోని వెలుగొందిన 16 మహాజనపదాల గురించి కొత్త సిలబస్లో చోటు కల్పించారు. వైదిక కాలంలో మహిళల విద్యా, పాండిత్యం గురించి ప్రస్తావించారు. కొత్త సిలబస్లో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం వంటి పంచ భూతాల భారతీయ తాత్విక భావనల్ని పరిచయం చేశారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, మహాభారతం వంటి భారతీయ గ్రంథాల ప్రస్తావనను కూడా చేర్చారు.

