Site icon NTV Telugu

Nagaland group: ఎన్నికల వేళ ప్రత్యేక స్టేట్ డిమాండ్

Naga

Naga

సార్వత్రిక ఎన్నికల వేళ ది ఈస్ట్రన్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. నాగాలాండ్‌లోని ఆరు జిల్లాలతో కూడిన ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. లోక్‌సభ ఎన్నికలను బాయ్‌కాట్‌ చేయాలని ది ఈస్ట్రన్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనివ్వడం లేదు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు రాష్ట్రంలోని ఏకైక లోక్‌సభ స్థానంలో ఎన్నికలకు సహకరించబోమని స్పష్టం చేసింది. నాగాలాండ్‌ తూర్పు ప్రాంతానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

నాగాలాండ్‌లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం గత కొన్నాళ్లుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 8 నుంచి కేంద్రం అక్కడ పబ్లిక్‌ ఎమర్జెన్సీ విధించింది. ఇది నాగాజాతికి చెందిన ఏడు గిరిజన తెగలకు నేతృత్వం వహిస్తున్న ఈఎన్‌పీవో ఎన్నికల ప్రచారానికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికలను కూడా బహిష్కరించాలని ఈఎన్‌పీవో పిలుపునిచ్చింది. అయితే, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హామీ మేరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ఈఎన్‌పీవో డిమాండ్‌ మేరకు కేంద్ర హోంశాఖ గతేడాది ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందం పలుమార్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. మరోవైపు తూర్పు నాగాలాండ్‌ ప్రాంత ప్రజల కోసం స్వతంత్ర వ్యవస్థను రూపొందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సిఫారసు చేసిందని ముఖ్యమంత్రి నెఫ్యూ రియో కూడా ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Exit mobile version