Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

  • స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
  • సమాజంలో భాగమేనని వెల్లడి
  • ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్
Mohan Bhagwat3

Mohan Bhagwat3

స్వలింగ వివాహాలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కులు కూడా సమాజంలో భాగమేనని.. వారికి గౌరవప్రదంగా కలిసి జీవించే హక్కు ఉండాలని వ్యాఖ్యానించారు. అయితే అలాంటి బంధాన్ని ‘వివాహం’గా పిలవకుండా.. కలిసి జీవించేందుకు ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థను రూపొందించవచ్చని సూచించారు. ముంబైలో ఐఐఎంయూఎన్ నిర్వహించిన యువజన సదస్సులో జెన్-జీ, జెన్-ఆల్ఫా యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఎల్‌జీబీటీ అయినా.. మరెవరైనా వారు మన సమాజంలో భాగమే. వారిని సమాజం అంగీకరించే సంప్రదాయం మన దేశంలో ఉంది’’ అని అన్నారు. భారతీయ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ప్రత్యేకమైన స్థానం ఉందని పేర్కొన్నారు. మన సంప్రదాయంలో వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించేందుకు ఏర్పడిన సౌకర్యం మాత్రమే కాదని.. అది కుటుంబ వ్యవస్థకు పునాది అన్నారు. కుటుంబం సమాజానికి మూల యూనిట్ అని.. మంచి పౌరులను తీర్చిదిద్దేది కుటుంబమేనని వివరించారు.

స్వలింగ జంటలు కలిసి జీవించేందుకు చట్టబద్ధమైన వ్యవస్థను రూపొందించవచ్చని.. కానీ దానిని ‘‘సేమ్ సెక్స్ మ్యారేజ్’’గా పిలవకూడదని అభిప్రాయపడ్డారు. స్వలింగ వివాహం అని కాకుండా స్వలింగ భాగస్వాములు కలిసి జీవించేందుకు ఒక ప్రత్యేక చట్టపరమైన విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాపై హెచ్చరిక

సోషల్ మీడియా వినియోగంపై కూడా మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం చట్టాలు తీసుకురావడం వల్ల సమస్యలు పరిష్కారం కావని.. సమాజం తన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విషయాన్ని నిజమని నమ్మకూడదు. ప్రస్తుతం కృత్రిమ మేధ (AI) సాయంతో నకిలీ వీడియోలు, తప్పుడు వ్యాఖ్యలు సృష్టించడం సాధ్యమవుతోంది. కాబట్టి అధికారిక వనరుల ద్వారా ధృవీకరించిన తర్వాతే సమాచారాన్ని నమ్మాలి. సోషల్ మీడియా వినియోగంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి.’’ అని సూచించారు.

జెన్-జీ యువతపై ప్రశంసలు

ఇటీవల విద్యార్థుల నిరసనలపై స్పందిస్తూ జెన్-జీ యువతను దేశద్రోహులుగా ముద్ర వేయడం సరైంది కాదని మరోసారి స్పష్టం చేశారు. ‘‘జెన్-జీ నిరసనలు చేస్తే వారు దేశ వ్యతిరేకులు కాదు. వారు మన తర్వాతి తరం. వారి సమస్యలు నిజమైనవే. భారత విద్యా వ్యవస్థలో ఇంకా ఎన్నో మార్పులు అవసరం. అందుకే వారు తమ గళాన్ని వినిపిస్తున్నారు.’’ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు కూడా ఏకాభిప్రాయం సాధించే ఒక మార్గమని పేర్కొన్న ఆయన… ఆందోళనలు విభజనలు సృష్టించడానికి కాకుండా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికే జరగాలని సూచించారు. యువత ప్రశ్నలు అడగడం మంచి పరిణామమని, వారి సందేహాలకు తార్కిక సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని మోహన్ భగవత్ అన్నారు.