Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి

  • భారత్‌లో కొనసాగుతోన్న జపాన్ ప్రధాని సనే తకైచి పర్యటన
  • మోడీతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
  • మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
Modi

Modi

జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోడీతో తకైచి సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. తాజాగా భారత్-జపాన్ ఆర్థిక భాగస్వామ్యానికి మరో కీలక మైలురాయి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని సనే తకైచి సంయుక్తంగా హర్యానాలోని ఐఎంటీ ఖర్‌ఖోడాలో నిర్మించిన మారుతీ సుజుకీ రూ.35,000 కోట్ల అత్యాధునిక కార్ల తయారీ ప్లాంట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇండియా-జపాన్ జాయింట్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.

సుమారు 800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌లో సమీకృత సప్లయర్ పార్క్ కూడా ఉంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఏడాదికి 10 లక్షల వాహనాల తయారీ సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు 21 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ కేంద్రాల్లో ఒకటిగా అవతరించనుంది.

సుజుకీ మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 5 లక్షల వాహనాలు కాగా.. త్వరలోనే దానిని 10 లక్షల యూనిట్లకు విస్తరిస్తామని తెలిపారు. ఇది భారత్-జపాన్ భాగస్వామ్యానికి, అలాగే ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో పెట్టుబడులు, ఉపాధి, ఎగుమతులు, సాంకేతిక అభివృద్ధి వేగంగా పెరుగుతున్నాయని అన్నారు.

ఇప్పటికే ఈ ప్లాంట్‌లోని రెండు తయారీ యూనిట్లలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఒక్కో యూనిట్‌కు ఏడాదికి 2.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉండటంతో ప్రస్తుతం మొత్తం సామర్థ్యం 5 లక్షల వాహనాలకు చేరుకుంది. ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీ, విక్టోరిస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మోడళ్లను తయారు చేస్తున్నారు.

ప్రస్తుతం మారుతీ సుజుకీ దేశవ్యాప్తంగా ఏడాదికి 26.5 లక్షల వాహనాల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో గురుగ్రామ్‌లో 5 లక్షలు, మానేసర్‌లో 9 లక్షలు, ఖర్‌ఖోడాలో 5 లక్షలు, గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో 7.5 లక్షల వాహనాల సామర్థ్యం ఉంది. ఖర్‌ఖోడా ప్లాంట్ పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల వాహనాలకు పెంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

ఈ అత్యాధునిక ప్లాంట్‌లో ఇండస్ట్రీ 5.0 సాంకేతికత, ఏఐ ఆధారిత కోబోట్లు (Collaborative Robots), 100 శాతం పునరుత్పాదక విద్యుత్ వినియోగం, జీరో లిక్విడ్ డిశ్చార్జ్, 100 శాతం నీటి రీసైక్లింగ్ వంటి పర్యావరణహిత సదుపాయాలను ఏర్పాటు చేశారు. అదనంగా 70 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్, బయోగ్యాస్ యూనిట్, గ్రీన్ లాజిస్టిక్స్ కోసం ప్రత్యేక రైల్వే సైడింగ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఖర్‌ఖోడా ప్లాంట్‌కు 2022 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అది పూర్తయి ప్రారంభం కావడంతో భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ముందడుగుగా మారింది.

అంతకముందు ఢిల్లీలో ఇండో-జపాన్‌ బిజినెస్‌ సమ్మిట్‌ జరిగింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. జపాన్‌ ప్రధాని తకైచీ మన లిటిల్‌ సిస్టర్‌ అంటూ సంబోధించారు. ‘‘జపాన్‌తో భారత్‌ సంబంధాలు ప్రత్యేకమైనవి… తకైచీ జపాన్‌ తొలి మహిళా ప్రధాని, ప్రజాదరణ ఉన్న లీడర్‌. భారత్-జపాన్‌ బంధం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మూలస్తంభం’’ అని మోడీ పేర్కొన్నారు. ఇక భారత్‌-జపాన్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఎనర్జీ, భద్రత, ముఖ్యంగా LNG సరఫరా ఒప్పందం, ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు.