దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు కేంద్రం వంతు వచ్చింది. మిషన్ 2029కి ఇప్పటి నుంచే మోడీ సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. 2029లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీ మార్పులు జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈనెల 26తో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ను విస్తరించాలని భావిస్తున్నారు. మోడీ తన మొదటి, రెండవ పర్యాయాల్లో మంత్రివర్గాన్ని క్రమం తప్పకుండా విస్తరించారు. ప్రస్తుత మంత్రివర్గంలో 72 మంది సభ్యులు ఉండగా.. గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారు.
ఇక ఇటీవల బీహార్, ఉత్తరప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా తమ మంత్రివర్గాలను విస్తరించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తన బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది.
గత రెండు పర్యాయాలను పరిశీలిస్తే.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత నవంబర్ 2014లో మోడీ తన మంత్రివర్గాన్ని తొలిసారిగా విస్తరించారు. సుమారు ఏడాదిన్నర తర్వాత జూలై 2016లో రెండవ విస్తరణ జరిగింది. సెప్టెంబర్ 2017లో జరిగిన మొదటి పర్యాయపు చివరి విస్తరణలో పలువురు మంత్రులకు పదోన్నతి లభించింది. ఇక రెండవ పర్యాయంలో ప్రభుత్వం ఏర్పడిన దాదాపు రెండేళ్ల తర్వాత జూలై 2021లో మంత్రివర్గాన్ని తొలిసారిగా విస్తరించారు. మే 2023లో పోర్ట్ఫోలియోల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇక మోడీ జూన్ 9, 2024న మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు రెండేళ్లు పూర్తికాబోతున్నాయి. ఫలితంగా మళ్లీ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో 72 మంది సభ్యులు ఉండగా.. గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించవచ్చు. కొంతమంది కొత్తవారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. వారి పనితీరు ఆధారంగా కొంతమంది ప్రస్తుత మంత్రులను తొలగించాలనే చర్చ కూడా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ప్రాంతీయ, కుల సమతుల్యత సాధించబడుతుందని భావిస్తున్నారు. ఒకవేళ విస్తరణ జరిగితే బీహార్ నుంచి ప్రాధాన్యత దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక బీజేపీ వర్గాల సమాచారం మేరకు.. పలువురు కొత్త ముఖాలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశం కూడా ఉంది. యువ అధ్యక్షుడు నితిన్ నబిన్తో సమన్వయం కొనసాగించేందుకు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయికి తీసుకువస్తారని తెలుస్తోంది.
