Meenakshi Lekhi: రెజ్లర్ల నిరసనపై మీడియా ప్రశ్నలు.. పరుగు పెట్టిన కేంద్రమంత్రి మీనాక్షీ లేఖి..

Meenakshi Lekhi

Meenakshi Lekhi

Meenakshi Lekhi: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే బ్రిజ్ శరణ్ పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. అయితే ఈ వివాదంపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని మీడిాయా ప్రశ్నించింది. అయితే ఆమె సమాధానం చెప్పకుండా పరిగెత్తుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Also: Hyderabad : వేధిస్తున్నాడని భర్తను అతి దారుణంగా నరికి చంపిన భార్య..

కేంద్రమంత్రి తన కారువైపు వెళ్తూ ఈ సమస్యపై చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. అయితే ఈ కేంద్రమంత్రిపై, బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్, ఆప్ పార్టీలు విరుచుకపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సిగ్గులేని మంత్రి అని వ్యాఖ్యానించింది. రెజ్లర్లకు సంబంధించిన ప్రశ్న విని సిగ్గులేని మంత్రి మీనాక్షి లేఖీ పారిపోయారని తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఆప్ విమర్శించింది. ఆమె పరుగెత్తుతున్న వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఇదిలా ఉంటే మంగళవారం రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో కలిపేందుకు హరిద్వార్ వెళ్లారు. అయితే రైతు సంఘాల నేతలు వారించడంతో వెనక్కి తగ్గారు. వారి డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి 5 రోజులు అల్టిమేటం ఇచ్చారు. మరోవైపు దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ స్పందించారు. వీరు గంగాలో పతకాలు పడేస్తామని వెళ్లి రాకేష్ టికాయత్ కు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తనపై విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. దోషిగా తేలితే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని సింగ్‌ వెల్లడించారు.