Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..

  • తమిళ ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
  • తమిళం నేర్పలేదని క్రైస్తవ మతం నేర్పిందని కామెంట్స్..
Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడు ఆర్థిక మంత్రి ఎన్ మేరీ విల్సన్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో రాజకీయంగా వివాదానికి దారితీశాయి. ‘‘తమిళ భాషను ఎంత చదివినా కొందరు అర్థం చేసుకోలేని విషయాలను క్రైస్తవ మతం తనకు నేర్పింది’’ అని ఆయన అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తూ.. తమిళ భాషను కించపరిచొద్దని వార్నింగ్ ఇచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తమిళ భాషను సరిగా మాట్లాడలేదని, వ్యాకరణపరమైన తప్పులు ఉన్నాయని ఎండీఎంకే ఎమ్మెల్యే టీఎం రాజేంద్రన్ విమర్శించారు. భవిష్యత్తులో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వస్తే తప్పులు లేకుండా తమిళంలో మాట్లాడాలని అన్నారు.

క్రైస్తవ మతం తనకు ప్రేమ భాష, శాంతి భాష, కరుణ భాష నేర్పిందని విల్సన్ అన్నారు. ఎంతగా తమిళాన్ని అధ్యయనం చేసినా కొందరు ఈ విలువలను అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. తాను బైబిల్ చదివానని, పుట్టుకతోనే క్రైస్తవుడినని అన్నారు. తన ప్రాధాన్యత తమిళ భాషకు సంబంధించిన విమర్శలు కావని, తమిళ పాలన, రాష్ట్రాభివృద్ధికి సంబంధించినవని అన్నారు. తాను మాట్లాడే శైలిని, వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ కొందరు ఎగతాళి చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత మత విశ్వాసాల గురించి మాట్లాడే క్రమంలో తమిళ భాషను కించపరిచేలా మంత్రి మాట్లాడారని ఆరోపించారు. ఆయన మతం నేర్పిన విషయాల గురించి అభ్యంతరం లేదని, కానీ తమిళాన్ని ఎందుకు కించపరిచారని విమర్శించారు. తమిళభాషను మతంలో పోల్చడం, మతం కన్నా తక్కువగా చూపించే ప్రయత్నం మంచిది కాదని, విల్సన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నాగేంద్రన్ డిమాండ్ చేశారు.

బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం విల్సన్ వ్యాఖ్యల్ని విమర్శించారు. టీవీకేను క్రైస్తవ ముఖ్యమంత్రి నడిపిస్తున్న క్రైస్తవ పార్టీగా అభివర్ణించారు. ఆ పార్టీ పూర్తిగా తమ మత విశ్వాసాలు, వ్యవస్థను తమిళ సంస్కృతిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మరోవైపు, తమిళ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మంత్రి విల్సన్ క్రాస్ గుర్తు గీసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.