Social Media: ఆన్లైన్ హాని నుంచి మహిళలు, పిల్లల్ని రక్షించే ఉద్దేశంతో, సోషల్ మీడియాకు కేవైసీ తప్పనిసరి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మైనర్లపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది, దీనికి బానిసగా మారుతున్నవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వినియోగదారులకు ‘నో యువర్ కస్టమర్’ (KYC) ధృవీకరణను తప్పనిసరి చేయాలని ఒక పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసింది. సైబర్ భద్రతపై మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ నివేదికలో భాగంగా హోం మంత్రిత్వ శాఖ, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలకు ఈ ప్రతిపాదనల్ని సమర్పించింది.
కేవైసీ ఇందుకే:
సోషల్ మీడియా, డేటింగ్ యాప్, గేమింగ్ ప్లాట్ఫారమ్స్ లలో కేవైసీ ఆధారిత గుర్తింపు, వయసు ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. వినియోగదారుల్ని గుర్తింపు వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కమిటీ పిలుపునిచ్చింది. వినియోగదారులను గుర్తించగలగడం,మైనర్లను ఆన్లైన్లో సురక్షితంగా ఉంచడం ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని లక్ష్యం. కేవైసీ తప్పనిసరి చేయడం వల్ల నకిలీ ప్రొఫైల్స్, వేధింపులు, సైబర్ స్టాకింగ్ ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
డేటింగ్, గేమింగ్ యాప్ల కోసం కఠినమైన లైసెన్సింగ్ నిబంధనల్ని, వయసు నిర్ధారణ ప్రక్రియ చేపట్టాలని ప్యానెల్ సూచించింది. నిబంధనలు పాటించని ప్లాట్ఫారమ్స్పై చర్యలు, భారీగా జరిమానా విధించాలని ప్రతిపాదించింది. ఈ సిఫారసుల ద్వారా డిజిటల్ ప్లాట్ఫారమ్స్ను సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టకున్నారు. అయితే, ఇది యూజర్స్ డేటా, గోప్యతను దెబ్బతీసే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి.
