Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సోనార్పూర్లో మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. స్థానిక ప్రజలు ఆగ్రహంతో శనివారం ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ‘‘పాలకులు హంతకులుగా మారారు’’ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీని టార్గెట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో బాధితు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది.
అభిషేక్ దాడిపై ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా మమతతో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చేతులు కలిపాయి. ప్రముఖ ఎంపీకి పోలీసు భద్రత లేకపోవడం చాలా తీవ్రమైన విషయమని అన్నారు. ఎక్స్లో మమత స్పందిస్తూ.. ‘‘పాలకులే ఇప్పుడు హంతకులుగా మారారు. ఈ చర్యకు బీజేపీ సిగ్గుపడాలి.’’ అని రాశారు. మరోవైపు తనపై బీజేపీ వాళ్లే దాడికి పాల్పడ్డారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ దాడిని కక్షపూరిత రాజకీయంగా అభివర్ణించారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం విధ్వేష రాజకీయాలు చేయడం తప్ప మరేమీ చేయడం లేదని అన్నారు.
ప్రతిపక్షాల విమర్శలకు బీజేపీ కూడా ధీటుగా స్పందించింది. ఇది స్థానిక ప్రజలు చేసిన దాడి అని, దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అన్నారు. ఎన్నిలక సమయంలో అభిషేక్ బెనర్జీ బహిరంగంగా బీజేపీ కార్యకర్తల్ని బెదిరించారని, ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా సవాల్ చేశారని అన్నారు. సీఎం సువేందు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పదే పదే దాడులు జరిగాయని, దీని వెనక అభిషేక్ నెట్వర్క్ ఉందని ఆరోపించారు. బీజేపీ బెంగాల్ చీఫ్ సమీక్ భట్టాచార్య స్పందిస్తూ.. అహంకారం, ఏకపక్ష భావజాలం ఎక్కువ కాలం నిలువదని టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
RULERS BECAME KILLERS- shame on you BJP https://t.co/DHNsnDAc9a
— Mamata Banerjee (@MamataOfficial) May 30, 2026
