NTV Telugu Site icon

దీదీ ఢిల్లీ పర్యటనపై జోరుగా ఊహాగానాలు..

Mamata Banerjee

Mamata Banerjee

ఐదురోజుల ఢిల్లీటూర్‌లో బెంగాల్‌ సీఎం మమత బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై పోరాటంలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌ గాంధీలతో సమావేశమైన మమత… తమ మధ్య సమావేశం పూర్తి సానుకూలదోరణిలో జరిగిందన్నారు. దీని ఫలితాలు భవిష్యత్తులో కనిపిస్తాయన్నారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ బంపర్ విక్టరీ తర్వాత తొలిసారిగా మమత.. సోనియాతో సమావేశమయ్యారు. ఢిల్లీలో వరుసగా విపక్షనేతలతో మమత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో… మమత కూడా నేతలతో సమావేశం కావడం, రాజకీయంగా చర్చనీయాంశమైంది.

పెగసస్ స్పైవేర్‌ కాంట్రవర్సీ, కోవిడ్‌-19 పరిస్థితి.. తమ మధ్య చర్చకు వచ్చినట్లు, మమత తెలిపారు పెగసస్ కాంట్రవర్సీపై కేంద్రం ఎందుకు చర్చకు సిద్ధం కావడం లేదన్నారు. పార్లమెంటులో ప్రజాసమస్యలపై చర్చ జరగకపోతే.. ఇంకెక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం సభలో సమాధానమిచ్చేవరకూ, విపక్షాలు.. సభను జరగనివ్వవన్నారు మమత. ఇక, ఇవాళ ఎన్సీపీ నేత పవార్ సహా పలువురు కీలక నేతలతో మమత భేటీ కానున్నారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు అనుసరించాల్సిన వ్యూహాలను.. ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఇక, మమత ఢిల్లీ పర్యటనపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరితో మమత వరుసగా సమావేశం అవుతున్నారు. సోనియా, కేజ్రీవాల్‌లను కూడా కలిశారు. ఇప్పుడు శరద్‌ పవార్‌తో కూడా సమావేశం అవుతున్నారు. విపక్ష కూటమికి ఎవరు మద్దతిచ్చినా ఓకే అంటున్నారు. పరిస్థితి చూస్తే 2023లో కేంద్రంలో మోడీ వర్సెస్‌ మమత అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ మమతా బెనర్జీ యాంటీ మోడీ ఫ్రంట్‌ను లీడ్‌ చేయగలరా? విపక్షాల ఐక్యత సాధ్యమేనా..? విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రాగలవా? అంత శక్తి ఉందా? అనే చర్చ సాగుతోంది.