Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

  • మమతా బెనర్జీకి ఈసీ లేఖ
  • 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
  • ఎన్నికల తర్వాత పార్టీలో తలెత్తిన విభేదాలు
Mamata Banerjee

Mamata Banerjee

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో కొనసాగుతున్న అంతర్గత రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. పార్టీ అసలు నాయకత్వం, అధికార ప్రతినిధుల విషయంలో మమతా బెనర్జీ వర్గం, రితబ్రత బెనర్జీ వర్గం పరస్పరం విభిన్న వాదనలు వినిపిస్తుండటంతో భారత ఎన్నికల సంఘం (ECI) జోక్యం చేసుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, అధికారిక సంతకాధికారులపై వస్తున్న విభేదాలపై ఇరు వర్గాల నుంచి వివరణ కోరింది. జూలై 6 సోమవారం సాయంత్రం 5:30 గంటలలోపు తమ సమాధానాలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఇటీవల టీఎంసీలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గం పార్టీపై తమకే చట్టబద్ధ హక్కు ఉందని, పార్టీ గుర్తు, సంస్థాగత వ్యవహారాలపై తమకే అధికారం ఉందని ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో ఈ వివాదాన్ని పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ఇరు వర్గాల అభిప్రాయాలను కోరింది.

అయితే ఎన్నికల సంఘం రితబ్రత బెనర్జీ వర్గానికి అవకాశం ఇవ్వడంపై టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘వారికి ఎలాంటి విశ్వసనీయత లేదు. రితబ్రత బెనర్జీని పార్టీ నుంచి ఇప్పటికే బహిష్కరించారు. అలాంటి వ్యక్తి పార్టీ తరఫున ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు? ఎన్నికల సంఘం వారితో ప్రత్యేకంగా సమావేశం కావడం ఎందుకు?.’’ అంటూ ప్రశ్నించారు.

మరో టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రితబ్రత నేతృత్వంలోని వర్గం అసలు టీఎంసీ అధికారిక వర్గమే కాదని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పార్టీ అధీకృత ప్రతినిధి లేదా అధికారిక సంతకాధికారి మాత్రమే కమిషన్‌తో సంప్రదింపులు జరపగలరని చెప్పారు. ‘‘స్వయంగా నాయకుడినని ప్రకటించుకున్న వ్యక్తికి పార్టీ తరఫున మాట్లాడే హక్కు లేదు’’. అని స్పష్టం చేశారు.

మరోవైపు రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని 10 మంది ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘం పూర్తి బెంచ్‌ను కలిసి తమ వాదనలు వినిపించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రితబ్రత.. తమకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇతర కమిషనర్లు ఓపికగా వినిపించే అవకాశం ఇచ్చారని తెలిపారు. ‘‘జూన్ 22న ప్రత్యేక సమావేశం నిర్వహించాం. ఆ తర్వాత నిబంధనల ప్రకారం అన్ని పత్రాలను ఎన్నికల సంఘానికి సమర్పించి పూర్తి బెంచ్‌ను కలిసే అవకాశం ఇవ్వాలని కోరాం. మా వినతిని పరిగణనలోకి తీసుకుని కమిషన్ సమయం కేటాయించింది. మా వాదనలను పూర్తిగా విన్న తర్వాత త్వరలోనే నిర్ణయం తెలియజేస్తామని కమిషనర్లు చెప్పారు.’’అని రితబ్రత వెల్లడించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఎదురైన ఓటమి అనంతరం పార్టీలో తీవ్ర విభేదాలు చెలరేగాయి. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది మమతా బెనర్జీ నాయకత్వానికి దూరమై రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించినట్లు సమాచారం. అనంతరం ఆయనను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడంతో పాటు 30 మంది సభ్యులతో కొత్త జాతీయ వర్కింగ్ కమిటీని కూడా ప్రకటించారు. దీంతో టీఎంసీలో నాయకత్వ పోరు కొత్త మలుపు తిరిగింది.