Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత..

  • బెంగాల్‌లో మమతా బెనర్జీకి నిరసన సెగ..
  • దీదీ కాన్వాయ్‌పై చెప్పులు, బురదతో నిరసనకారులు దాడి..
  • తనను చంపేసే వారంటూ మమత ఆగ్రహం..
Mamata

Mamata

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రికి నిరసన సెగ ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై ఆందోళనకారులు దాడి చేశారు. తమపై గుర్తుతెలియని దుండగులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని, ఈ దాడిలో ప్రాణాలు పోయేవే అని మమత ఆరోపించారు. ఈ దాడిని రాష్ట్ర బీజేపీ ఖండించింది. ఈ హింసాకాండలో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

పోలీస్ కస్టడీలో టీఎంసీ పార్టీ కార్యకర్త మరణించాడని ఆ పార్టీ బెంగాల్‌లో తీవ్ర నిరసన తెలుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తల ఇంటికి మమతా బెనర్జీ వెళ్తుండగా హాలిసహర్‌లో నిరసన ఎదుర్కొన్నారు. నిరసనకారులు మమతా బెనర్జీ కారును చుట్టుముట్టి దానిపై బురద రాసి, బూట్లు, నీళ్ల సీసాలు విసిరినట్లు తెలుస్తోంది. నిరసనకారుల్ని పోలీసులు వెనక్కి తోసేయడానికి ప్రయత్నించారు. మమతను ఉద్దేశిస్తూ ‘‘దొంగను తరిమికొట్టండి’’ అని నిరసనకారులు నినాదాలు చేశారు.

ఇటుకలు, రాళ్లు తమపై పడి ఉంటే తాను చనిపోయి ఉండేదాన్ని అని మమతా బెనర్జీ మీడియాతో అన్నారు. బయట నుంచి వచ్చిన సంఘవిద్రోహ శక్తులు పోలీసుల ముందే తన కారుపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. నా కారు కిటీలు మూసి ఉండకపోతే, నా తల పగిపోయి, చనిపోయే దాన్ని అని, ఇలాంటి దాడిని ఎప్పుడూ ఎదుర్కోలేదని, మమ్మల్ని కాపాడటానికి పోలీసులు ఏం చేయలేదని, వాళ్లు కేవలం బీజేపీకి మాత్రమే రక్షణ కల్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, రాజ్యసభ ఎంపీ డోలా సేన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

మమతా బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య ఖండించారు. ఈ ఘటనలో తమ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాళ్లు, బురద, చెప్పులు విసరడాన్ని బీజేపీ సమర్థించదని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తాయని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ పోలీసుల అదుపులో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురై మరణించడంతో వివాదం మొదలైంది. పోలీసులు చిత్రహింసల వల్లే తమ పార్టీ కార్యకర్త మరణించారని టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ సంఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అతడి భార్య డిమాండ్ చేస్తోంది. పోలీసులు మాత్రం గుండెపోటు కారణంగానే అతను మరణించినట్లు స్పష్టం చేశారు.