పెగాసస్.. ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం ఇప్పుడు భారత్లో సంచలనంగా మారింది… ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండగా.. పార్లమెంట్ సమావేశాలను సైతం పెగాసస్ వ్యవహారం కుదిపేస్తోంది.. ఈ తరుణంలో.. సంచలన వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రజాస్వామ్య భారత్ను మోడీ సర్కారు నిఘా దేశంగా తయారు చేయాలనుకుంటోందని దుయ్యబట్టిన ఆమె.. పెగాసస్కు భయపడి తన ఫోన్కు ప్లాస్టర్ వేసుకున్నానని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ విపరీత చర్యలకు కూడా ప్లాస్టర్ వేయాల్సిందేనని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఇక, ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు దీదీ.
భారత్లో సంక్షేమం మానేసి బీజేపీ సర్కార్ నిఘా దేశంగా మార్చాలనుకుంటోందని ఫైర్ అయ్యారు మమతా బెనర్జీ.. అందుకే పెట్రోల్, డీజిల్, ఇతర వస్తు, సేవల ద్వారా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తోన్న సొమ్ముతో సంక్షేమ పథకాలు చేపట్టకుండా.. వ్యక్తులపై నిఘా పెట్టేందుకు.. ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసేందుకు వినియోగిస్తున్నారంటూ విమర్శించారు. ఇక, తన ఫోన్ను కూడా ట్యాపింగ్ చేస్తారని తెలుసు.. అందుకే ఎన్సీసీ అధినేత శరద్ పవార్, ఇతర ప్రతిపక్ష నేతలు, సీఎంలతో నేను ఫోన్లలో మాట్లాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు దీదీ.. పెగాసస్కు భయపడి నా ఫోన్కు ప్లాస్టర్ వేసుకున్నానని.. కానీ, హ్యాకింగ్ వంటివేవీ వారిని రక్షించలేవంటూ వార్నింగ్ ఇచ్చారు. రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి కూడా ప్లాస్టర్ వేయాలని పిలుపునిచ్చారు.