Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం పేదోళ్ల కడుపు కొట్టింది.. పోరాడాలని మల్లిఖార్జున ఖర్గే పిలుపు

  • మోడీ ప్రభుత్వం పేదోళ్ల కడుపు కొట్టింది
  • ఐక్యం కావాల్సిన సమయం వచ్చింది
  • పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు ఖర్గే పిలుపు
Mallikarjun Kharge

Mallikarjun Kharge

మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి కోట్లాది మంది పేదోళ్ల కడుపు కొట్టిందని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో మలికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోడీ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాన్ని రద్దు చేసి కోట్లాది మంది పేద, బలహీన వర్గాల ప్రజలను నిస్సహాయులను చేసింది. మోడీ ప్రభుత్వం పేదల కడుపుపై ​​కొట్టడమే కాకుండా వారి వీపు వెనుక పొడిచింది. ఎంజీఎన్ఆర్ఈజీఏను రద్దు చేయడం జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం. సోనియా గాంధీ ఇటీవల రాసినట్లుగా ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం అందరి ఆశయాన్ని సాకారం చేసింది. పని చేసే రాజ్యాంగ హక్కును అమలు చేసింది. ఇప్పుడు ఈ పథకాన్ని సమాధి చేశారు. ఇది రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలోని కోట్లాది మంది శ్రామిక ప్రజలపై ఆర్థిక, మానవ పరిణామాలను కలిగిస్తుంది. మనందరినీ రక్షించే హక్కులను కాపాడుకోవడానికి ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఐక్యమవ్వడం అత్యవసరం.’’ అని అన్నారు.

ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ‌తో పాటు పాటు ఇతర సీనియర్ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. శశిథరూర్ కూడా హాజరు కావడం ప్రత్యేక ఎట్రాక్షన్‌గా నిలిచింది.

ఇది కూడా చదవండి: Jabalpur: జబల్పూర్‌ అగ్రి వర్సిటీలో దారుణం.. యువతిపై గ్యాంగ్‌రేప్

ఇదిలా ఉంటే ఆదివారం (డిసెంబర్ 28) కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భంగా
దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ చిత్రపటాలతో మండల, గ్రామస్థాయిల్లో పీసీసీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘పని చేసే హక్కు, శ్రమ గౌరవం, సమాజిక న్యాయం’’ పేరుతో ఆందోళనలు, నిరసనలు తెలపనున్నారు. ఉపాధి హామీ పథకం పేరును ‘జీ రామ్ జీ’గా మార్చారు. అప్పుడే కేంద్ర నిర్ణయాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ నిరసన తెలిపింది. రేపు దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.