Bengal hostage row: పశ్చిమ బెంగాల్ మాల్దాలో ఏడుగురు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) అధికారుల్ని నిర్బంధించడంపై సుప్రీంకోర్టు మమతా బెనర్జీ సర్కార్పై సీనియస్ అయ్యింది. ఈ ఘటన గురువారం ఉదయం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వాన్ని “నేరపూరిత వైఫల్యం”గా అభివర్ణిస్తూ విమర్శించింది. అయితే, ఈ వ్యవహారం బెంగాల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీగా మారింది. బెంగాల్లో ఎన్నికలను వాయిదా వేసేందుకు బీజేపీ రాష్ట్రపతి పాలన తేవాలని కుట్ర పన్నుతోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
ఇదిలా ఉంటే, ఈ నిరసనకు సంబంధించిన మాస్టర్ మైండ్ ఎంఐఎం నాయకుడని తేలింది. మొఫర్కేరుల్ ఇస్లాం ఈ నిర్బంధానికి ప్రజల్ని రెచ్చగొట్టినట్లు తేలింది. దీంతో ఇస్లాంతో పాటు 18 మందిని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఇస్లాం, 2021 ఎన్నికల్లో బెంగాల్లోని ఇటహార్ నుంచి ఎంఐఎం నేతగా పోటీ చేశారు. మాల్దా ఘటన వెనక ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు.
Read Also: Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..
ఈ ఘటన తర్వాత ఇస్లాం రాష్ట్రం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బాగ్డోగ్రా ఎయిర్పోర్టులో అధికారులు అరెస్ట్ చేశారు. నిరసనల సమయంలో ఇస్లాం కలెక్టర్, ఎస్పీలతో సహా ఉన్నతాధికారుల్ని బహిరంగంగా సవాల్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ‘‘ ఓయ్ ఎస్పీ, కలెక్టర్ సీఐడీ ఎవరు? ఐబీ ఎక్కడ? మీరందరూ ఎక్కడ ఉన్నారు.? ఇక్కడికి రండి’’ అన్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, మాల్దాలోని కాలియాచక్ ఘటనపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టింది. శుక్రవారం ఉదయం, దర్యాప్తును పర్యవేక్షించేందుకు ప్రధాన దర్యాప్తు అధికారి, ఐజీ ర్యాంకు ఐపీఎస్ అధికారి అయిన సోనియా సింగ్ కోల్కతాకు చేరుకున్నారు. ఎన్నికల సమయంలో ఎస్ఐర్ ప్రక్రియ పర్యవేక్షిస్తున్న న్యాయాధికారుల్ని కలియాచక్ 2 బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్లో 9 గంటలకు పైగా బందీలుగా ఉంచారు. 9 గంటల తర్వాత ఒక పోలీస్ టీం అధికారుల్ని రక్షించింది. ఈ ఆపరేషన్ జరిగే సమయంలో పోలీస్ వ్యాన్పై ఆందోళనకారులు రాళ్లు విసిరారు.
