Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్‌పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్

  • తీవ్ర దుమారం రేపుతోన్న రామమందిర విరాళాల స్కామ్
  • రామమందిర విరాళాల స్కామ్‌పై స్పందించరే
  • బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
Mahua Moitra

Mahua Moitra

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్య రామమందిరం విరాళాల కుంభకోణం అంశం రచ్చరచ్చ చేస్తోంది. కోట్లాది రూపాయలు దారి మళ్లిపోయాయి. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇంకోవైపు యోగి ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరిపిస్తోంది.

తాజాగా ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా స్పందిస్తూ బీజేపీపై ధ్వజమెత్తారు. రామ మందిరం పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందిన బీజేపీకి ఇప్పుడు ఈ అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. ‘‘తాము హిందూ ప్రభుత్వం, సనాతన ప్రభుత్వం అని బీజేపీ చెప్పుకుంది. రామ్ మందిరం నిర్మాణం పేరుతో దేశంలోని ప్రతి నగరం, ప్రతి గ్రామంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించింది. కానీ ఇప్పుడు అదే రామ్ మందిరం విరాళాల వ్యవహారంలో ఏం జరుగుతోంది? టెట్, నీట్ పేపర్ లీక్‌ల విషయంలోనూ బీజేపీ దగ్గర సమాధానం లేదు.’’ అని విమర్శించారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘‘వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ-సోషియల్ యాక్టివిటీస్ బిల్’’ గురించి స్పందిస్తూ బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘బెంగాల్‌లో యాంటీ-గూండా చట్టం తీసుకొస్తున్నారని విమర్శిస్తున్నారు. కానీ అసలు గూండాలు బీజేపీలోనే కూర్చున్నారు. వారు ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలను దొంగిలించే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆ ఆటలు ఆపండి. ముందుగా రామ్ మందిరం విరాళాల వ్యవహారంపై సమాధానం చెప్పండి. మీ చర్యలపై దేశ ప్రజలకు జవాబు ఇవ్వండి.’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

అలాగే ‘‘ప్రజలు ఒక పార్టీ గుర్తుపై గెలిపించిన ప్రజాప్రతినిధులను మరో పార్టీలోకి లాగడం గురించి దేశ ప్రజలకు ఆసక్తి లేదు. రామ్ మందిరం విరాళాల కేసు, టెట్-నీట్ అవకతవకలపై బీజేపీ వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.’’ అని మహువా మొయిత్రా అన్నారు.