Maharashtra: మహారాష్ట్ర పెళ్లివేడుక విషాదంగా మారింది. పెళ్లి అతిథులతో వెళ్తున్న టెంపోను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 13 మంది మరణించారు. 25 మందికి పైగా గాయపడ్డారు. పాల్ఘర్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దహాను ప్రాంతంలోని బాపుగావ్ నుంచి ధనివారి గ్రామంలో జరిగే నిశ్చితార్థ వేడుకకు 40 మందికి పైగా ప్రయాణికులు టెంపోలో వెళ్తున్నారు. అయితే, ఒక కిలోమీటర్ డైవర్షన్ తప్పించుకోవడానికి టెంపో డ్రైవర్ రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే ప్రమాదానికి కారణమైనట్లు అధికారులు చెబుతున్నారు.
ఇలా వెళ్లే క్రమంలో గుజరాత్ నుంచి ముంబై వస్తున్న కంటైనర్ ట్రక్ ఒక్కసారిగా అదుపు తప్పి టెంపోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక బైక్ కూడా ప్రమాదానికి గురైంది. ఇలా ఢీకొట్టిన తర్వాత కంటైనర్ టెంపోపై పడిపోవడంతో ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కాసా సబ్ డిస్ట్రిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 11 మంది మరణించారు. మరో ఇద్దరు దహానులోని వేదాంత ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
