మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సర్కారు ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను త్వరలో తగ్గిస్తామని సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వ్యాట్ తగ్గింపుపై రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నట్టు షిండే చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఇంధన ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.28గా ఉంది. అయితే గత ఏడాది నవంబర్లో కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 5, రూ. 10 తగ్గించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్ను తగ్గించాయి.
ఇటీవల నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండే ఇవాళ శానససభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. ఉదయం జరిగిన బలనిరూపణ పరీక్షలో 164 మంది శాసనసభ్యుల మద్దతుతో ఆయన నెగ్గారు. అనంతరం అసెంబ్లీలో ప్రసంగించిన ఏక్నాథ్ షిండే.. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
Devendra Fadnavis: అవును మాదీ ఈడీ ప్రభుత్వమే.. ‘ఏక్నాథ్-దేవేంద్ర’ సర్కార్..
వాస్తవానికి ఇంధనంపై అటు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుండగా, రాష్ట్రాలు కూడా వ్యాట్ను వసూలు చేస్తున్నాయి. ఇటీవల పలు కారణాలతో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్తో పాటు డీజిల్ ధరలు కూడా సెంచరీ దాటేశాయి. ఈ క్రమంలో తాము కొంత మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని చెప్పిన కేంద్రం.. రాష్ట్రాలు కూడా వ్యాట్ను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఈ దిశగా షిండే కీలక ప్రకటన చేయడం గమనార్హం.