పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన అనేక రకాలైన సంక్షోభాల నుంచి తేరుకునేందుకు పొదుపు పాటించాలని హైదరాబాద్ వేదికగా ఆదివారం ప్రధాని మోడీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పౌరులు, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు ఆదా చేయాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ను పొదుపుగా వాడాలని, ప్రజా రవాణా, మెట్రో, కార్పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రధాని మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ప్రభుత్వ పనులకు ఇకపై ఈ-వాహనాలను మాత్రమే వినియోగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అన్ని శాఖాపరమైన సమావేశాలను ఆన్లైన్లో నిర్వహించాలని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం నిర్ణయించింది.
మే 12 నుంచి ఫ్రాన్స్ వేదికగా జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ప్రభుత్వ అధికారులు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించింది. మంగళవారం నుంచి అన్ని సమావేశాలను ఆన్లైన్లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఐటీ, సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్ తెలిపారు.
ఆదివారం హైదరాబాద్ వేదికగా జరిగిన సభలో మోడీ పౌరులకు కీలక పిలుపునిచ్చారు. ఇంధనం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణాను, కార్ పూలింగ్ను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించుకోవాలని, కార్ల వినియోగం తగ్గించుకుని మెట్రో వంటి పబ్లిక్ రవాణా వ్యవస్థల్ని వాడుకోవాలని సూచించారు.
ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఇంటి నుంచే పని చేయడం, వర్చువల్ సమావేశాలను ప్రోత్సహించాలని ప్రజలను ప్రధాని కోరారు. అలాగే కనీసం ఏడాది పాటు అనవసర విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని.. అంతేకాకుండా ఏడాది పాటు పెళ్లిళ్లు, ఇతర వేడుకల కోసం కొత్త బంగారు ఆభరణాలు కొనకుండా ఉండాలని కోరారు. మొత్తానికి మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.
