Site icon NTV Telugu

Moneylenders Harassment: మరీ ఇంత దారుణమా.. అప్పు తీర్చేందుకు రైతుతో కిడ్ని అమ్మించిన వడ్డీ వ్యాపారులు..

Untitled Design (2)

Untitled Design (2)

అప్పులు తీర్చలేకపోయిన రైతులను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమ వడ్డీ వ్యాపారులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. రైతుల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో అప్పులు ఇచ్చి, చివరికి వాటిని తీర్చేందుకు రైతులు తమ కిడ్నీలను అమ్ముకునే పరిస్థితి వరకు తీసుకువచ్చిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు చట్టపరమైన రక్షణతో పాటు తక్షణ ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ సదాశివ్ కుడే అనే రైతు ఈ దారుణానికి బలయ్యాడు. వ్యవసాయం ద్వారా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో, అదనపు ఆదాయం కోసం పాల వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పెట్టుబడి కోసం పలువురు వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి రోజుకు రూ.10 వేల వడ్డీకి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. అయితే, ఆ అప్పును సకాలంలో తీర్చలేకపోవడంతో వడ్డీ భారం పెరిగి మొత్తం అప్పు రూ.74 లక్షలకు చేరుకుంది.

ఇదే సమయంలో అతడు కొనుగోలు చేసిన ఆవులు చనిపోవడం, సాగు చేసిన పంటలు నష్టపోవడంతో సదాశివ్ పరిస్థితి మరింత దిగజారింది. అప్పులు తీర్చలేని స్థితికి చేరుకున్న అతడిని వడ్డీ వ్యాపారులు తీవ్రంగా వేధించడం ప్రారంభించారు. చేసేదేమీ లేక తన భూమి, ట్రాక్టర్‌తో పాటు ఇంట్లోని విలువైన గృహోపకరణాలను కూడా అమ్మేశాడు. అయినప్పటికీ అప్పు మొత్తం తీరలేదు.

ఈ పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల్లో ఒకరు కిడ్నీ అమ్ముకోవాలని సదాశివ్‌కు అమానుషమైన సలహా ఇచ్చాడు. ఆ మాటలతో మానసికంగా కుంగిపోయిన సదాశివ్, ఒక ఏజెంట్ సహాయంతో ముందుగా కోల్‌కతాకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి కంబోడియాకు తీసుకెళ్లి శస్త్రచికిత్స ద్వారా అతని కిడ్నీని తొలగించారు. కిడ్నీ అమ్మకానికి ప్రతిఫలంగా అతడికి కేవలం రూ.8 లక్షలు మాత్రమే ఇచ్చారు.

కిడ్నీ అమ్ముకున్నప్పటికీ అప్పులు పూర్తిగా తీరలేదని, తాను తీవ్రంగా మోసపోయానని సదాశివ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అతడు వాపోయాడు. న్యాయం జరగకపోవడంతో మానసికంగా, శారీరకంగా తీవ్ర వేదన అనుభవిస్తున్నానని తెలిపాడు. తనకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా మహారాష్ట్ర సచివాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.

ఈ ఘటన రైతుల దయనీయ స్థితికి అద్దం పడుతోంది. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వర్గాలు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రైతులకు చట్టపరమైన భద్రత, ఆర్థిక మద్దతు అందించడం అత్యవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.

Exit mobile version