Spurious Liquor Tragedy: మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం అనుమానిత ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బండా సబ్డివిజన్ పరిధిలోని ఘూఘ్రా, జాలంపూర్, బరాజ్ తదితర గ్రామాల్లో అనుమానాస్పద మద్యం సేవించిన పలువురు గ్రామస్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్లు అధికారికంగా నిర్ధారించారు. మరో 25 మందికి పైగా మెరుగైన వైద్యం కోసం సాగర్కు తరలించారు.
అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన గ్రామస్థులు
అనుమానాస్పద మద్యం సేవించిన తర్వాత పలువురు గ్రామస్థుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వాంతులు, ఇతర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న వారిని వెంటనే బండాలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్య సేవల కోసం సాగర్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఘటనాస్థలికి కలెక్టర్, ఎస్పీ
ఘటన తీవ్రతను గుర్తించిన జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. సాగర్ కలెక్టర్ ప్రతిభా పాల్, పోలీసు సూపరింటెండెంట్ అనురాగ్ సుజానియా అధికార యంత్రాంగంతో కలిసి ప్రభావిత గ్రామాలకు చేరుకున్నారు. వారు గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించడంతో పాటు బండా ఆసుపత్రిని సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
9 మంది మృతి.. అధికారికంగా నిర్ధారణ
సాగర్ జిల్లా సీఎంహెచ్ఓ డాక్టర్ దేవేశ్ పటేరియా ఇప్పటివరకు 9 మంది మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. మరో 25 మందికి పైగా బాధితులను మెరుగైన చికిత్స కోసం సాగర్కు తరలించినట్లు తెలిపారు. వైద్యుల బృందం ఇప్పటికే రాత్రి నుంచే ప్రభావిత ప్రాంతంలో అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. అనుమానాస్పద మద్యం సేవించిన తర్వాత ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.
పోలీసు, ఎక్సైజ్ శాఖల దర్యాప్తు
ఈ ఘటనపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ దర్యాప్తు ప్రారంభించాయి. గ్రామస్థులు సేవించిన మద్యం నిజంగా కల్తీదేనా, దాని వల్లే ఈ మరణాలు సంభవించాయా అనే అంశంతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభావిత గ్రామాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించడంతో పాటు అనుమానాస్పద మద్యం సరఫరా వెనుక ఉన్న వ్యక్తులపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

