మధ్యప్రదేశ్ను వరదలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. బర్గి డ్యామ్ 13 గేట్లు తెరవడంతో నర్మదా ఉధృతంగా ప్రవహిస్తోంది. రేవాలో 4,000 మందికి పైగా ప్రజలను రక్షించారు. మధ్యప్రదేశ్లోని తూర్పు జిల్లాలైన దిండోరి, పన్నా, రేవా, సత్నా, నర్సింగ్పూర్, ఛతర్పూర్, మౌగంజ్, మైహార్లలో వరదలకు గురయ్యాయి. వర్షాల కారణంగా నర్మదా, మందాకిని, అష్టభుజ నదులు పొంగిపొర్లుతున్నాయి.
మధ్యప్రదేశ్లోని తూర్పు జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా వరద లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నర్మదా, మందాకిని నదులతో సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. శుక్రవారం కూడా వరదలు కొనసాగాయి. నీరు ప్రవేశిస్తున్న మధ్యప్రదేశ్లోని నివాస ప్రాంతాల్లో యంత్రాంగం సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరం చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దిండోరి, పన్నా, రేవా, సత్నా, నర్సింగ్పూర్, ఛతర్పూర్ జిల్లాలు అత్యధిక ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా మైహార్, దిండోరి జిల్లాల్లోని పాఠశాలలను మూసివేశారు. దిండోరిలోని అంగన్వాడీ కేంద్రాలను కూడా మూసివేశారు.
రేవా జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. శుక్రవారం నాటికి సుమారు 3,000 మందిని 27 సహాయక శిబిరాలలో ఉంచారు. ఇప్పటివరకు వరదల కారణంగా చిక్కుకుపోయిన 4,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు, సహాయక బృందాలను వరద ప్రభావిత ప్రాంతాలలో మోహరించారు.
మధ్యప్రదేశ్లో ఆగస్టు 25 వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడించింది. మధ్య -పశ్చిమ-మధ్య ప్రాంతాలలో వర్షపాతం క్రమంగా పెరుగుతుందని పేర్కొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్లో ఈ కాలానికి సాధారణ సగటు వర్షపాతం 675.1 మి.మీ. కాగా.. 599 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది 11 శాతం లోటును సూచిస్తుంది. తూర్పు మధ్యప్రదేశ్లో 11 శాతం, పశ్చిమ మధ్యప్రదేశ్లో 12 శాతం వర్షపాతం లోటు నమోదైంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం..ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో నెలకొన్న అల్పపీడనం, రుతుపవన ద్రోణి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.

