Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..

  • పూణే‌లో ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ బెడ్‌షీట్ వివాదం..
  • పాకిస్తాన్ ఉత్పత్తులు ఇండియా ఎలా వచ్చాయి..?
  • ఘటనపై విచారణ చేస్తున్న పోలీసులు..
Viral News

Viral News

Shocking: మహారాష్ట్ర పూణేలోని ఒక జాతరలో కొనుగోలు చేసిన బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ అనే ట్యాగ్ ఉండటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంబంధిత ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పింప్రి చించ్వాడ్‌లోని ప్రసిద్ధ మొరయా సోసావి ఆలయంలో సంకష్టి చతుర్థి సందర్భంగా బుధవారం జాతర జరిగింది. ఈ జాతరలో పూజా సరాఫ్ అనే మహిళ పలు వస్తువులతో పాటు బెడ్ షీట్ కొనుగోలు చేసింది.

అయితే, దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ ట్యాగ్ చూసి షాకైంది. బెడ్‌షీట్‌ను ఉతుకుతున్నప్పుడు ఇది కనిపించింది. ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘ జాతరలో ఒక బెడ్‌షీట్ కొన్నాను. కనీసం మనం పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా నివసించడం లేదు. అయినా మా ఇంట్లో ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ వస్తువు ఉండటం ఏంటి.?’’ అని ప్రశ్నించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మహిళ నుంచి అధికారికం ఫిర్యాదు అందకపోయినా, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

×
×
Ad

ఇలాంటి వస్తువులను విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను పోలీసులు కోరినట్లు సమాచారం. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత నుంచి భారత్, పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువుల దిగుమతిపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఈ బెడ్‌షీట్ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో పాకిస్తాన్‌లో తయారైన కాస్మోటిక్ ఉత్పత్తులను నిల్వ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యాపారులపై కేసుల నమోదయ్యాయి. ఛత్రపతి సంభాజీ నగర్లో కూడా ఇలాంటి ఆరోపణలపై ముగ్గురిపై చర్యలు తీసుకుంటున్నారు.