Jammu Kashmir: కాశ్మీర్‌లో హై అలర్ట్.. సీసీటీవీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పాక్ ఆపరేటివ్..

  • జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్‌లో లష్కరేతోయిబా, పాక్ ఉగ్రవాదులు..
  • మార్కెట్ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్..
  • భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన భద్రతా బలగాలు..
Jk Police

Jk Police

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్‌ లోని ఒక స్థానిక మార్కెట్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరేతోయిబాకు చెందిన ఉగ్రవాది కనిపించడంతో భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చర్యల్ని చేపట్టాయి. మార్కెట్ ప్రాంతంలోని ఒక సీసీటీవీ కెమెరాలో ఉగ్రవాదులకు సంబంధించిన చిత్రాలు నమోదయ్యాయి. ఫుటేజీలో కనిపించిన ఉగ్రవాదుల్లో ఒకరిని కుల్గాం జిల్లా ఖేర్వాన్‌కు చెందిన మహ్మద్ లతీఫ్ భట్‌గా గుర్తించారు. మరో వ్యక్తి హంజుల్లా అనే పాకిస్తానీ కమాండర్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌కు డాక్టర్లు, ఇంజనీర్లు గుడ్‌బై.. అసలు కారణాలు ఏంటి.?

ఈ వీడియో వెలుగులోకి రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యల్ని చేపట్టాయి. డెంగర్ పోరా, ఖాజీబాగ్ ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టారు. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ గాలింపు చర్యల్ని చేపట్టారు. ఉగ్రవాదుల కదలికల్ని తెలుసుకోవడానికి, నిఘా సమాచారాన్ని సేకరించే ప్రయత్నాల్లో భాగంగా స్థానిక నివాసితులను కూడా ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ డిసెంబర్ 25న, సాయంత్రం 6.12 గంటల ప్రాంతంలో రికార్డయింది. మహ్మద్ లతీఫ్ భట్ ఈ ఏడాది నవంబర్‌లో లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ కాశ్మీర్ రివల్యూషన్ ఆర్మీ (కేఆర్‌ఏ)లో చేరాడని అధికారులు తెలిపారు.