NTV Telugu Site icon

Kolkata doctor case: వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు ముందు మద్యం.. విపరీతంగా పోర్న్ వీడియోలు..

Kollata

Kollata

Kolkata doctor case: కోల్‌కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అనే వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. ఆర్‌జి కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్‌‌పై ఈ అఘాయిత్యానికి నిందితుడు ఒడిగట్టాడు. ఆమె మృతదేహం శుక్రవారం ఆస్పత్రి సెమినార్ హాల్‌లో లభించింది. ఈ కేసు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు త్వరతిగతిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని ట్రేస్ చేశారు. ప్రస్తుతం అతడిని 14 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు.

ఇదిలా ఉంటే విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్‌కి నాలుగు వివాహాలు జరిగాయని తెలుస్తోంది. అయితే, ఇతని ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు వదిలివెళ్లారని, మరో భార్య క్యాన్సర్‌తో మరణించినట్లు తెలిసింది. ఇక అత్యాచార ఘటనకు ముందు నిందితుడు మద్యం తాగి ఉన్నాడని, తరుచుగా అశ్లీల వీడియోలు చూస్తాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేరం జరిగిన రోజు రాత్రి 11 గంటల సమయంలో సంజయ్ మద్యం సేవించడానికి ఆస్పత్రి వెనక ఉన్న ప్రదేశానికి వెళ్లాడని, అక్కడే మద్యం తాగుతూ పోర్న్ చూసినట్లు తెలుస్తోంది.

Read Also: Rape D OTT: నేరుగా ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ ‘రేప్‌ డీ’ మూవీ

విచారణ సమయంలో సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్ నుంచి అనేక హింసాత్మక అశ్లీల వీడియోలను కనుగొన్నారు. అతని మొబైల్ దాదాపుగా హింసాత్మక పోర్న్ వీడియోలతో నిండి ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడి మానసిక ఆరోగ్యం బాగా లేకపోవడమో లేక వికృత శృంగార వాంఛలు ఉన్న వ్యక్తి అని తెలుపుతోంది. ఘటన జరిగిన రోజు సంజయ్ చాలా సార్లు ఆస్పత్రి ప్రాంగణంలోకి ప్రవేశించడాని పోలీసులు తెలిపారు. అత్యాచారం, హత్యకు గురై వైద్యురాలి మృతదేహం శుక్రవారం ఉదయం సెమినార్ హాల్‌లో కనుగొనబడింది.

ఘటన జరిగిన చెస్ట్ మెడిసిన్ విభాగానికి రెండు ఎంట్రీ పాయింట్ల ఉన్నట్లు తెలుస్తోంది. వెనక తులుపు తెరిచి ఉంది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ వెనుక ద్వారం ద్వారా ఐదు నుండి ఆరు మంది వ్యక్తులు డిపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించినట్లు సిసిటివి ఫుటేజీలో బంధించబడిందని వర్గాలు తెలిపాయి. అయితే, ఈ వ్యక్తులు ఆసుపత్రిలో చేరిన బంధువులకు వద్దకు వెళ్లినట్లు తేలింది. అయితే, రాత్రి సమయంలో సంజయ్ రాయ్ ఒక్కడే అత్యాచారానికి పాల్పడేందుకు ఆ విభాగానికి వెళ్లినట్లు తెలుస్తోంది. నేరం చేసిన తర్వాత, రాయ్ సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని తేలింది. ఘటనా స్థలం నుంచి రక్తపు మరకలను కడిగేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. CCTV ఫుటేజీలో రాయ్ ఉదయం 4:45 గంటలకు సెమినార్ గది నుండి బయలుదేరినట్లు కూడా చూపబడింది. దీనికి తోడు ఘటన స్థలంలో లభించిన బ్లూటూత్ హెడ్‌ఫోన్ నిందితుడి మొబైల్‌తో ఆటోమెటిక్‌గా కనెక్ట్ కావడంతో పోలీసులు సంజయ్ రాయ్‌ని అరెస్ట్ చేశారు.