Bankra mosque: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న 136 ఏళ్ల పురాతన మసీదు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన భద్రత, రన్వే కార్యకలాపాలకు ఆటంకంగా మారుతోందని అధికారులు గత కొన్ని దశాబ్ధాలుగా చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ మసీదును తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ‘‘గౌరీపసూర్ జామే మస్జిద్’’ లేదా ‘‘బంక్రా మసీదు’’గా పిలిచే ఈ మసీదు ఏయిర్పోర్టు రన్ వే పక్కనే ఉంది. దీంతో ఇది భద్రతా పరమైన ఆందోళనల్ని పెంచుతోంది. ఎయిర్ పోర్ట్ ఆపరేషనల్ జోన్లోనే ఈ మసీదు ఉంది. సెకండ్ రన్వేకు కేవలం 165 మీటర్ల దూరంలో ఉంది. నియమాల ప్రకారం కనీసం 240 మీటర్ల దూరంలో ఉండాలి. దీని కారణంగా విమానాలు దిగే టచ్ డౌన్ పాయింట్ను 88 మీటర్లకు మార్చాలి వచ్చింది. పెద్ద విమానాలు ల్యాండ్ కావాలంటే సమస్యలు ఎదురవుతున్నాయి. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం నుంచి విమానాశ్రయం లోపల నుంచి మసీదుకు వెళ్లే మార్గాన్ని మూసివేశారు. అలాగే, మసీదులో నమాజ్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మసీదును ఎయిర్పోర్టుకు వెలుపల ఉండే సురక్షిత ప్రాంతానికి మారుస్తున్నారు. ఉత్తర డమ్డమ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సౌరవ్ సిక్దార్ ఈ అంశంపై స్పందిస్తూ.. మసీదుకు వచ్చే వారిలో చాలా మంది భద్రతా కారణాలతో తీసుకున్న చర్యలకు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. విమానాశ్రయ పరిధిలోకి ప్రత్యేక అనుమతితో ప్రవేశం కల్పించడం భద్రతాపరంగా ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. మసీదు ఉన్న భూమి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పేరుతో నమోదై ఉందని, ఆ స్థలంపై తుది నిర్ణయం వారిదే అని ఎమ్మెల్యే చెప్పారు.

