Ketan Agarwal Case: కేతన్ అగర్వాల్ అనే యువ వ్యాపారవేత్తను, అతడికి కాబోయే భార్య సియా గోయల్ కుట్ర పన్ని హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పూణేలో జరిగిన ఈ హత్య ఇప్పుడు దేశం హాట్ టాపిక్గా మారింది. లోహ్గఢ్ కోటకు తీసుకెళ్లిన సియా, అక్కడి నుంచి తోసేసి కేతన్ను చంపేసింది. ఈ హత్యకు ఆమె, ఆమె ప్రియుడు చేతన్ కలిసి ప్లాన్ చేశారు. ముందుగా అంతా ఇది ప్రమాదమే అని అనుకున్నారు. పోలీసులు కూడా యాక్సిడెంటల్ డెత్గా కేసు ఫైల్ చేశారు.
అయితే, కేతన్ సోదరి అనుమానంతో అసలు కుట్ర బయటపడింది. జూన్ 18న సియాతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లిన కేతన్ లోహ్గఢ్ కోట లోయలో పడి మరణించినట్లు అంతా భావించారు. అయితే, దీనికి ముందు జూన్ 14 కూడా ఇలాంటి ప్రయత్నమే చేసి సియా విఫలమైంది. ఈ మొత్తం కేసులో కేతన్ సోదరి అనుమానమే కేసు మలుపుకు కారణమైంది. అంత్యక్రియలు జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా, కేతన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వారి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో కేతన్ మరణం గురించి, ఆ ప్రమాదం గురించి కేతన్ సోదరి, సియాను గుచ్చి గుచ్చి ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు సియా పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీని తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబం పట్టుబట్టడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు పరిశీలించడం ప్రారంభమైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని విచారించారు. దర్యాప్తులో భాగంగా సియా గోయల్, చేతన్ చౌదరి మధ్య ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. నిజానికి సియా సంబంధం గురించి వారికి తెలిసినప్పటికీ కేతన్తో వివాహం తర్వాత అంతా సర్దుకుంటాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఘటనా ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే, జూన్ నెలలో ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ హుడీ ధరించి, ఒక వ్యక్తి లోహ్గఢ్ పరిసరాల్లో కేతన్, సియాలను అనుసరించడంతో, ఆ తర్వాత ఇలా ఫాలో చేసిన వ్యక్తి చేతన్ చౌదరిగా గుర్తించారు. దీంతో మొత్తం కుట్ర వెలుగులోకి వచ్చింది.
సియా, చేతన్ మధ్య మూడేళ్లుగా రిలేషన్ ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య వారు ఏకంగా 2004 సార్లు మాట్లాడుకున్నారు. మొత్తం మీద 238 గంటల పాటు కాల్స్ నడిచాయి. వీరిద్దరూ ఫేస్ టైమ్, వాట్సా్ప్లో కూడా ఇలా మాట్లాడుకునే వారు. ఇలా ఇద్దరు కలిసి ఏ పాపం తెలియని ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారు.

