పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజురోజుకూ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో క్రికెట్ లింక్ కూడా బయటపడింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయంపై సియా సోదరుడు సాహిల్ గోయల్ పోలీసులకు కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం.
తొలి పరిచయం
దాదాపు 10 గంటలకు పైగా సియా సోదరుడు సాహిల్ గోయల్ను పోలీసులు విచారించారు. తనకు చేతన్ చౌదరి ముందే తెలుసని చెప్పినట్లు సమాచారం. అంతకుముందు సియా తల్లిదండ్రులు మాత్రం చేతన్ గురించి తమకు ఎలాంటి అవగాహన లేదని పేర్కొన్నారు. సాహిల్ తెలిపిన వివరాల ప్రకారం.. తన క్రికెట్ మ్యాచ్లకు సియా తరచూ వచ్చేదని.. ఆ సమయంలోనే సియాకు చేతన్ చౌదరితో పరిచయం ఏర్పడిందని వెల్లడించాడు. అనంతరం గత ఏడాది ఓ ఉమ్మడి స్నేహితుడు నిర్వహించిన దీపావళి వేడుకలో ఇద్దరూ మళ్లీ కలిశారని.. అక్కడి నుంచి వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
సాహిల్ గోయల్ పోలీసులకు మరో కీలక విషయం చెప్పినట్లు సమాచారం. తన సోదరికి పెళ్లి ఇష్టం లేకపోతే తమ కుటుంబం ఆ సంబంధాన్ని వెంటనే రద్దు చేసేదని పేర్కొన్నాడు. మరోవైపు సియా తల్లి పూజా గోయల్ కూడా.. తన కుమార్తె ఎప్పుడూ పెళ్లిపై అసంతృప్తి వ్యక్తం చేయలేదని.. చేతన్ చౌదరిని తాను ఎప్పుడూ చూడలేదని చెప్పింది. అయితే సియా తరఫు న్యాయవాది మాత్రం.. సియా, చేతన్ కేవలం స్నేహితులేనని వాదిస్తున్నారు.
2 వేలకుపైగా ఫోన్ కాల్స్
దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిశీలించిన కాల్ డీటైల్ రికార్డుల (CDR) ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి సియా-చేతన్ మధ్య 2 వేలకుపైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు గుర్తించారు. ఈ కాల్స్ మొత్తం వ్యవధి దాదాపు 238 గంటలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ తమ మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ చాట్స్, ఇన్స్టాగ్రామ్ సందేశాలు, ఇతర డిజిటల్ రికార్డులను పూర్తిగా డిలీట్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ డేటాను తిరిగి రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు ప్రకారం.. కేతన్ హత్యకు ఒక రోజు ముందు అంటే జూన్ 17న సియా, చేతన్ పూణెలోని లుల్లానగర్ ప్రాంతంలోని ఓ కేఫేలో దాదాపు గంటపాటు సమావేశమైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమావేశంలోనే హత్యకు సంబంధించిన తుది ప్రణాళిక సిద్ధం చేశారా? లేదా ఇతర అంశాలపై చర్చించారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
కేతన్ అగర్వాల్, సియా గోయల్ల వివాహం ఈ ఏడాది నవంబర్లో జరగాల్సి ఉంది. అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో సియా తన ప్రియుడు చేతన్తో కలిసి కేతన్ను లోహగడ్ కోటకు ట్రెక్కింగ్ పేరుతో తీసుకెళ్లి లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. లోనావాలా డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గజానన్ టోంపే మాట్లాడుతూ.. ‘‘కేతన్ హత్యలో సియా, చేతన్ ఇద్దరి పాత్రకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి.’’ అని తెలిపారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనను అత్యంత దిగ్భ్రాంతికరమని అభివర్ణిస్తూ.. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

