Kerala: సొంత బిడ్డను చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఒక తల్లిని కేరళ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని, ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె కూడా ఆత్మహత్యకు యత్నించిందని కోర్టు పేర్కొంది. ‘మెంటల్ హెల్త్కేర్ యాక్ట్, 2017’ (Mental Healthcare Act) లోని నిబంధనలను అన్వయిస్తూ జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. అసలేం జరిగిందంటే..
ఛత్తీస్గఢ్కు చెందిన ఒక మహిళకు పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామల నుంచి తీవ్రమైన వేధింపులు ఎదురయ్యాయి. ఆమెకు మరొకరితో అక్రమ సంబంధం ఉందంటూ, పుట్టిన 15 నెలల పాప అసలు ఆమె భర్తకే పుట్టలేదంటూ నిత్యం శారీరకంగా, మానసికంగా వేధించేవారు. అదనపు కట్నం కోసం కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చేవారు. ఈ నిరంతర వేధింపులు భరించలేక తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆమె.. 2016 ఫిబ్రవరి 16న 14 పారాసిటమాల్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలోనే ఆమె 15 నెలల బిడ్డ కూడా శ్వాస ఆడక మరణించింది. ఈ కేసులో 2023 నవంబర్లో సెషన్స్ కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టును ఆలోచింపజేసిన సూసైడ్ లెటర్ ..
ఈ ఘటన జరగడానికి ముందు ఆమె పెద్ద మొత్తంలో పారాసిటమాల్ టాబ్లెట్లు మింగడమే కాకుండా, తన మణికట్టును కోసుకుని, ఒక సూసైడ్ లెటర్ కూడా రాసింది. టాబ్లెట్లు మింగిన తర్వాత తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత బిడ్డకు ఏమైందో తనకు తెలియదని సదరు మహిళ కోర్టుకు తెలిపింది. ఈ ఆధారాలన్నీ ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. 2018 నుంచి అమల్లోకి వచ్చిన ‘మెంటల్ హెల్త్కేర్ యాక్ట్-2017’ లోని సెక్షన్ 115 ప్రకారం.. ఎవరైనా వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే, వారు తీవ్రమైన మానసిక ఒత్తిడిలోనే ఆ పని చేసినట్లు చట్టం భావిస్తుంది. అలాంటి వారికి ఐపీసీ (IPC) కింద శిక్ష విధించకూడదు. “2021లో ఈ కేసు ట్రయల్ స్టార్ట్ అయ్యే నాటికే ఈ చట్టం అమలులో ఉంది. కాబట్టి సెషన్స్ కోర్టే దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సింది. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లే లెక్క. అందువల్ల ఐపీసీ కింద ఆమెకు శిక్ష విధించడం చెల్లదు” అని హైకోర్టు స్పష్టం చేస్తూ ఆమెను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.

