NTV Telugu Site icon

Son Chops Up Father: శ్రద్ధా కేసును తలపించేలా.. తండ్రి శరీరాన్ని 32 ముక్కలు చేసిన కొడుకు

Karnataka Incident

Karnataka Incident

Karnataka Man Chops Up Father’s Body Into 32 Pieces: ఢిల్లీ శ్రద్ధా వాకర్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి, ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ ప్రదేశాల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేసిన తర్వాత 6 నెలల అనంతరం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తర్వాత పలువురు కూడా శ్రద్ధాలాగే చంపుతాం అంటూ మహిళలు, యువతులను బెదిరించిన ఘటనలు కూడా చూశాం. కొందరైతే అదే తరహాలో హత్య చేసేందుకు ప్రయత్నించారు.

Read Also: India-China border clash: అరుణాచల్ ప్రదేశ్ ఘర్షణపై స్పందించిన చైనా..

ఇదిలా ఉంటే శ్రద్ధా కేసును తలపించేలా కర్ణాటకలో దారుణం జరిగింది. బాగల్ కోట్ కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రిని హత్య చేసి, మృతదేహాన్ని 32 ముక్కలుగా చేసి బోర్ వెల్ లో పడేశాడు. ఈ హత్య కేసు వెలుగులోకి రావడంతో పోలీసులు బోర్ వెల్ నుంచి వ్యక్తి శరీరభాగాలను వెలికితీశారు. నిందితుడు విఠల కులాలీని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.

డిసెంబర్ 6న తండ్రి పరుశురామ్ కులాలి(53)ను కొడుకు విఠల(20) ఆవేశంతో ఇనుపరాడ్ తో కొట్టి హత్య చేశాడు. పరుశురాం నిత్యం మద్యం తాగి వచ్చి ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన విఠలను తిడుతూ ఉండే వాడు. పరుశురాం భార్య, పెద్ద కొడుకు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం వేధింపులు తాళలేక విఠల ఇనుపరాడ్ తో తండ్రిని కొట్టి హత్య చేశాడు. హత్య తర్వాత పరుశురామ్ మృతదేహాన్ని 32 ముక్కలుగా నరికి, బాగల్ కోట్ జిల్లాలోని ముధోల్ నగర శివార్లలోని మంటూర్ బైపాస్ సమీపంలో సొంత పొలంలోని ఓపెన్ బోర్ వెల్ లో శరీర భాగాలను పారేశాడు.