Karnataka High Court: వివాహ ధృవీకరణ సర్టిఫికేట్లు జారీ చేసేందుకు ‘‘వక్ఫ్ బోర్డు’’లకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై తాజాగా కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ బోర్డులు మ్యారేజ్ సర్టిఫికేట్లు జారీ చేయడంపై కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డుకి అధికారాలు కల్పిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులను ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై కర్ణాటక హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Read Also: Bomb threats: మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. రెండు రోజుల్లో 12 విమానాలకు హెచ్చరికలు..
ఏ ఆలం పాషా దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ ఎన్వీ అంజరియా, జస్టిస్ కేవీ అరవింద్లతో కూడిన డివిజనల్ బెంజ్ నోటీసులు జారీ చేసి నవంబర్ 12లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాహ ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి మాత్రమే బోర్డుకు అధికారం ఉందని ప్రభుత్వ న్యాయవాది మౌఖిక సమాధానం ఇచ్చారు. దానికి కోర్టు..‘‘ వివాహ ధృవీకరణ పత్రాలు జారీ చేసే పని వక్ఫ్ బోర్డుకు లేదు’’ అని చెప్పింది. ప్రభుత్వ, మైనారిటీ, వక్ఫ్ అండ్ హజ్ శాఖ అండర్ సెక్రటరీ చేతుల మీదుగా జారీ చేయబడిన 30/09/2023 నాటి ప్రభుత్వ ఉత్తర్వు వక్ఫ్ చట్టం-1995లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రకటించాలని పిటిషన్దారు హైకోర్టుని కోరారు.