BJP: భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కొలంబియాలోని ఒక యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ.. భారత్లో ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆయన అవమానకరమని అన్నారు. విదేశీ గడ్డపై భారతదేశాన్ని అప్రతిష్టపాటు చేయడానికి మరోసారి కాంగ్రెస్ ఎంపీ ప్రయత్నించారని కంగనా ఆరోపించారు.
‘‘అతను ఒక అవమానకరమైన వ్యక్తి. దేశాన్ని విమర్శిస్తూ, ప్రతిచోటా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అందరికీ తెలుసు. ఇక్కడి ప్రజలు గొడవపడేవారని, వారు నిజాయితీపరులు కాదని అతను చెబుతుంటే, దీని ద్వారా అతను భారతీయులు బుద్ధిహీనులు అని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు,’’ అని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా, సాధారణ ప్రజల్ని కూడా అవమానించడమే అని ఆమె అన్నారు. దేశాన్ని అతను ఎప్పుడూ కించపరుస్తూనే ఉంటాడని, అతడి వ్యాఖ్యలకు దేశం సిగ్గుపడుతుందని ఆమె అన్నారు.
Read Also: Osmania Hospital : ఉస్మానియా కొత్త ఆస్పత్రి భవనం ఎన్ని అంతస్తులో తెలుసా.?
విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. ‘‘భారతదేశంలో జరుగుతున్న ఏకైక అతిపెద్ద ప్రమాదం ప్రజాస్వామ్యంపై దాడి. భారతదేశం వాస్తవానికి దాని ప్రజలందరి మధ్య సంభాషణ… విభిన్న సంప్రదాయాలు, మతాలు, ఆలోచనలకు స్థలం అవసరం. ఆ స్థలాన్ని సృష్టించడానికి ఉత్తమ మార్గం ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రస్తుతం, ప్రజాస్వామ్య వ్యవస్థపై సమూల దాడి జరుగుతోంది. కాబట్టి అది ఒక ప్రమాదం’’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ విదేశాలకు వెళ్లి, అక్కడి నుంచి అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు అని అన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను విదేశాల్లో కించపరచడం ఆయనకు అలవాటుగా మారిందని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
