బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్-యోగా గురువు బాబా రామ్దేవ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పరస్పరం మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. ఇటీవల జెన్-జీని ఉద్దేశించి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మురికి కాలువ తరం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
ఇక కంగనా రనౌత్ వ్యాఖ్యలపై యోగా గురువు బాబా రామ్దేవ్ తీవ్రంగా స్పందించారు. “ఆమె బాల్యం ఎలా ఉండేది? ఆమె యవ్వనం ఎలా ఉండేది? ఆమె గత విజయాలు ఎలా ఉండేవి? నేను అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఆమెది కలుషితమైన మనస్తత్వం.” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలే కంగనాకు కోపం తెప్పించాయి. ఇన్స్టాగ్రామ్ వేదికగా బాబా రామ్దేవ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన ఊహాగానాలు చేస్తున్నారని.. అంతేకాకుండా తన నడవడికపై గురించి మాట్లాడే నైతిక అధికారం ఆయనకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. “బాబాజీ.. నా యవ్వనం లేదా పడకగది గురించి పగటి కలలు కనకండి. పుకార్లు, గాసిప్ల ఆధారంగా మాత్రమే ఊహించుకోవచ్చు. కనీసం తప్పుడు/మోసపూరిత వాదనల కోసం నన్ను సుప్రీంకోర్టు ఎప్పుడూ మందలించలేదు… ఇది కఠినమైన వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. గాసిప్లు లేదా ఊహాగానాలపై కాదు..’’ అంటూ కంగనా బదులిచ్చారు. ‘‘అయినా నా నడవడిక గురించి పాఠాలు చెప్పకండి.. నా నడవడిక మీకంటే చాలా ఉత్తమం. ఇక్కడ ఎలాంటి మోసం కనుగొనబడలేదు. సుప్రీంకోర్టుతో ఎప్పుడూ చీవాట్లు తినలేదు” అంటూ కంగనా మండిపడ్డారు. కంగనా వ్యాఖ్యలపై బాబా రామ్దేవ్ మళ్లీ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.

