Annamalai: తమిళనాడులో బీజేపీకి ఆశాకిరణంగా కనిపించిన కే. అన్నామలై, ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పటికే ఆయన జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్కు రాజీనామా లేఖ అప్పగించినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా అన్నామలై తమిళనాడులో బీజేపీని నడిపించేందుకు ప్రయత్నించారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, బీజేపీ ఆయనను పక్కన పెట్టింది. ఆయన ఆకస్మిక నిర్ణయం వెనక ఏఐడీఎంకేతో పొత్తు, ఎన్నికల వైఫల్యాలు, పార్టీ కేంద్ర నాయకత్వ ప్రణాళిక మధ్య పెరుగుతున్న అంతరాలు దాగి ఉన్నాయి.
తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు మంగళవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్లను కలిశారు. తాను సొంత పార్టీ పెట్టి, సొంత మార్గంలో పయనించాలని అన్నామలై భావిస్తున్నారు. బీజేపీ నుంచి సౌహార్దపూర్వక రీతిలో విడిపోవాలని కోరుకుంటున్నట్లు ఆయన బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను కూడా బీజేపీ అగ్రనాయకత్వానికి వివరించారు. అయితే, అన్నామలై లెవనెత్తిన అంశాలను పరిశీలించడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని పార్టీ ఆయనను కోరింది. బుధవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.
అన్నామలై పార్టీలో కొనసాగేలా ఒప్పించేలా బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే, ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అన్నామలై ముందుగా ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి, ఆ తర్వాత పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన ‘వి ది లీడర్స్’ అనే నాయకత్వ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. 234 సభ్యులు ఉన్న తమిళనాడు ఎన్నికల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఈ ఫలితాల తర్వాత అన్నామలై రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
