Jyoti Malhotra: పాకిస్తాన్ “గూఢచారి” యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం భారతదేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’తో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. తాజాగా, ఆమె పాకిస్తాన్లోని లాహోర్లో పర్యటిస్తున్న సమయంలో ఏకే-47 గన్మెన్లు సెక్యూరిటీగా ఉన్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈమెతో సహా మరో 11 మందిని కూడా గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ఇప్పటి వరకు మూడుసార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చింది. ముఖ్యంగా, పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఆమె జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం సంచలనంగా మారింది.
Read Also: Indian Students: క్లాసులకు రాకుంటే వీసా రద్దు.. భారత విద్యార్థులకు అమెరికా హెచ్చరిక..
ఇదెలా ఉంటే, జ్యోతి నలుగురు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో కలిసి పనిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఐఎస్ఐతో కలిసి పని చేస్తున్నట్లు తెలుసని అధికారులు గుర్తించారు. హర్యానా పోలీసులు ఆమె డిజిటల్ పరికరాలను పరిశీలించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు జ్యోతి మల్హోత్రా ఫోన్, ల్యాప్ టాప్ సహా అన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె అందులోని మెసేజ్లు, డేటాని తొలగించినప్పటికీ, పోలీసులు 12 టీబీ డేటాను తిరిగి పొందగలిగారు. అధికార వర్గాలు చెబుతున్న దాని ప్రకారం, జ్యోతి తాను ఐఎస్ఐ అధికారులతో మాట్లాడుతున్నట్లు బాగా తెలుసని, ఆమె ఎలాంట భయం లేకుండా సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, జ్యోతి మల్హోత్రా విలాసవంతమైన ప్రయాణాలు, ఆమె ఆదాయానికి అసమానంగా ఉన్న ఖర్చులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.