దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన నోట్ల కట్ల వ్యవహారం కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ‘క్యాష్ ఎట్ హోమ్’ వ్యవహారంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నమోదైన మూడు ఆరోపణలూ రుజువయ్యాయని విచారణ కమిటీ తేల్చింది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో భారీ మొత్తంలో లెక్కల్లోకి రాని నగదు లభించడం, కీలక ఆధారాలను సక్రమంగా భద్రపరచకపోవడం, ఈ వ్యవహారంపై ఆయన ఇచ్చిన వివరణలు అసంపూర్తిగా, తప్పించుకునే ధోరణిలో ఉండటం వంటి ఆరోపణలు నిర్ధారణ అయ్యాయని పేర్కొంది.
అయితే ఈ నగదు వ్యక్తిగతంగా జస్టిస్ వర్మకు చెందినదని క్రిమినల్ చట్టపరంగా కమిటీ నిర్ధారించలేదు. ఆయన నియంత్రణలో ఉన్న అధికారిక నివాస ప్రాంగణంలో గణనీయమైన మొత్తంలో వివరాలు లేని నగదు లభించిందని, దాని మూలం, యాజమాన్యం, అక్కడ ఎందుకు ఉందనే విషయాలను ఆయన సంతృప్తికరంగా వివరించలేకపోయారని మాత్రమే కమిటీ స్పష్టం చేసింది.
అసలు ఏం జరిగింది?
2025 మార్చి 14న ఢిల్లీలోని 30 తుగ్లక్ క్రెసెంట్లో ఉన్న జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పే సమయంలో అక్కడి స్టోర్రూమ్లో రూ.500 నోట్ల కట్టలు, పెద్ద మొత్తంలో నగదు కనిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని నగదు కట్టలు 1.5 అడుగులకు పైగా ఎత్తులో ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయడంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అంతర్గత విచారణకు ఆదేశించారు. అనంతరం జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి, విచారణ పూర్తయ్యే వరకు ఆయన న్యాయపరమైన విధులను ఉపసంహరించారు.
మూడు ఆరోపణలూ రుజువు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 1968 కింద ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. జస్టిస్ వర్మపై మూడు ప్రధాన ఆరోపణలను పరిశీలించింది.
1. అధికారిక నివాసంలో భారీగా లెక్కల్లోకి రాని నగదు:
అగ్నిప్రమాదం తర్వాత స్టోర్రూమ్లో గణనీయమైన మొత్తంలో రూ.500 నోట్లు ఉన్నట్లు ఆధారాలు వెల్లడించాయని కమిటీ తెలిపింది. అవి అక్కడక్కడా కనిపించిన కొన్ని నోట్లు కాదని, కట్టలు, గుట్టలు, స్టాక్ల రూపంలో ఉన్నాయని పేర్కొంది. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిది? అక్కడ ఎందుకు ఉంది? అనే ప్రశ్నలకు జస్టిస్ వర్మ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయారని తెలిపింది. స్టోర్రూమ్ పూర్తిగా తన నియంత్రణకు బయట ఉందన్న జస్టిస్ వర్మ వాదనను కూడా కమిటీ తిరస్కరించింది. అది ఆయన అధికారిక నివాసంలో భాగమేనని, సంస్థాగత నియంత్రణ ఆయన పరిధిలోనే ఉందని పేర్కొంది.
2. ఆధారాలను భద్రపరచడంలో వైఫల్యం:
అగ్నిప్రమాదం అనంతరం స్టోర్రూమ్ను వెంటనే సీజ్ చేయలేదని కమిటీ గుర్తించింది. మొదట స్పందించిన అధికారులు వెళ్లిపోయిన తర్వాత అక్కడ శుభ్రపరిచే పనులు జరిగాయని తెలిపింది. అధికారిక తనిఖీ జరిగే సమయానికి నగదు అక్కడ లేకుండా పోయిందని పేర్కొంది. దీంతో కీలక ఆధారాలను సక్రమంగా భద్రపరచలేదని కమిటీ తేల్చింది. స్టోర్రూమ్ సమీపంలో జస్టిస్ వర్మ ప్రైవేట్ సెక్రటరీ రాజిందర్ సింగ్ కార్కీ, ఇంటి సిబ్బంది సభ్యుడు మహ్మద్ రాహిల్ ఉన్నట్లు కూడా నివేదికలో ప్రస్తావించింది. అయితే నగదును జస్టిస్ వర్మ స్వయంగా తొలగించారని మాత్రం కమిటీ నిర్ధారించలేదు.
3. వివరణలు అసంపూర్తిగా, తప్పించుకునే ధోరణిలో ఉండటం:
నగదు అక్కడ ఎందుకు ఉంది, దాని మూలం ఏమిటి, ఎవరిది అనే కీలక ప్రశ్నలకు జస్టిస్ వర్మ ఇచ్చిన వివరణలు సరిపోలేదని కమిటీ పేర్కొంది. అగ్నిప్రమాదం తర్వాత తీసుకున్న చర్యలపైనా ఆయన వివరణలు సంతృప్తికరంగా లేవని తెలిపింది.
నగదు మొత్తం ఎంత?
ఈ వ్యవహారంలో నగదు ఖచ్చితమైన మొత్తం ఎంతనేది కమిటీ తేల్చలేకపోయింది. కారణం.. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో నగదును అధికారికంగా స్వాధీనం చేసుకోవడం, లెక్కించడం, జాబితా తయారు చేయడం లేదా భద్రపరచడం జరగలేదు. అయితే గణనీయమైన మొత్తంలో రూ.500 నోట్లు అక్కడ ఉన్నాయని మాత్రం కమిటీ నిర్ధారించింది.
జస్టిస్ వర్మ ఏం చెప్పారు?
తనపై వచ్చిన ఆరోపణలను జస్టిస్ వర్మ ఖండించారు. తన నివాసం నుంచి నగదు స్వాధీనం చేసుకోలేదని వాదించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, మొదట స్పందించిన అధికారుల్లో తాను లేనందున ఆ ప్రదేశం వారి నియంత్రణలోనే ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా నగదును కావాలనే అక్కడ పెట్టి ఉండొచ్చని, నకిలీ నోట్లు కావచ్చని, కుట్ర జరిగి ఉండొచ్చని, మొదట స్పందించిన అధికారులు నగదును తొలగించి ఉండొచ్చని పలు అవకాశాలను ఆయన తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే ఈ వాదనలకు తగిన ఆధారాలు లేవని కమిటీ తెలిపింది. జస్టిస్ వర్మ తరఫున ఎలాంటి సాక్షులను గానీ, అఫిడవిట్లను గానీ సమర్పించలేదని పేర్కొంది. చివరకు స్టోర్రూమ్ తన నియంత్రణకు పూర్తిగా బయట ఉందన్న వాదనను తిరస్కరించింది.
పార్లమెంటరీ ప్రక్రియకు మాత్రమే పరిమితం
విచారణ కమిటీ మూడు ఆరోపణలు రుజువయ్యాయని తేల్చినప్పటికీ.. ఇది క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పు లేదా నేర నిర్ధారణ కాదని స్పష్టం చేయాల్సి ఉంది. పార్లమెంట్ ద్వారా న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియకు సంబంధించిన ఆరోపణలు రుజువయ్యాయని మాత్రమే కమిటీ నిర్ధారించింది. అంటే.. స్టోర్రూమ్లో భారీగా వివరాలు లేని నగదు లభించిందని, దాని గురించి జస్టిస్ వర్మ సంతృప్తికరంగా వివరించలేకపోయారని, ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు సక్రమంగా భద్రపరచలేదని కమిటీ తేల్చింది.
పార్లమెంటరీ విచారణ ఎలా సాగింది?
2025 సెప్టెంబర్లో లోక్సభ స్పీకర్ జస్టిస్ వర్మను తొలగించాలన్న తీర్మానాన్ని స్వీకరించిన తర్వాత సంయుక్త విచారణ కమిటీ ఏర్పాటైంది. సెప్టెంబర్ 17న కమిటీ తొలి సమావేశం జరిగింది. నవంబర్ 26న జస్టిస్ వర్మపై అధికారికంగా ఆరోపణలు నమోదు చేసింది. కమిటీ ఏర్పాటును జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. 2026 జనవరి 16న ఆయన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అనంతరం సాక్ష్యాల పరిశీలన ప్రారంభమైంది. ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్, అగ్నిమాపక శాఖ నుంచి పలు రికార్డులను కమిటీ కోరింది. మార్చి 13 నుంచి 17 వరకు ఘటనకు సంబంధించిన పలువురు అధికారులు, మొదట స్పందించిన సిబ్బందిని విచారించి, క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించారు.
అయితే పార్లమెంట్ ద్వారా తొలగించే పరిస్థితి ఎదురవుతున్న సమయంలోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనపై కొనసాగుతున్న అభిశంసన ప్రక్రియకు ఆచరణాత్మకంగా ముగింపు పలికినట్లైంది. రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రకారం.. న్యాయమూర్తి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించి, దాని ప్రతిని బహిరంగపరిచిన తర్వాత రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణ ఉద్యోగుల మాదిరిగా రాష్ట్రపతి నుంచి ప్రత్యేకంగా ‘అంగీకారం’ అవసరం ఉండదని పేర్కొన్నాయి. అనంతరం న్యాయశాఖ దీనిని అధికారికంగా నోటిఫై చేస్తుంది.

