Jharkhand Protest: పేపర్ లీక్పై విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి జార్ఖండ్ సర్కార్ దిగొచ్చింది. ఆగస్టు 10న జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపునిచ్చారు. ఆదివారం మరోసారి విద్యార్థులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. అయినప్పటికీ JPSC-JSSC పరీక్షల రద్దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సీబీఐ దర్యాప్తుపై హామీ ఇచ్చేంత వరకు రాజీ ప్రసక్తే లేదని విద్యార్థి నాయకులు తేల్చి చెప్పారు.
విద్యార్ధులతో జరిగిన చర్చల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 14వ JPSC పరీక్షను రద్దు చేయడం, పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై దర్యాప్తు చేయడం, నియామక ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. అయితే, ఈ ప్రతిపాదనల్ని విద్యార్థులు పట్టించుకోవడం లేదు. సీబీఐ దర్యాప్తు లేకుండా చేసే ఇతర దర్యాప్తులు చేయడం, సీజీఎల్ పరీక్షను రద్దు చేయకపోవడం తమ ప్రధాన సమస్యల్ని పరిష్కరించవని విద్యార్థులు స్పష్టం చేశారు.
విద్యార్థులు చేస్తు్న్న డిమాండ్లలో 99 శాతం అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి సుదివ్య కుమార్ సోను తెలిపారు. మూడు రోజుల చర్చల తర్వాత 14వ JPSC పరీక్షతో పాటు 2023-25 బ్యాక్లాగ్ నియామకాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై రెండు దిశల్లో దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రిమినల్ అంశాలను రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేస్తుందని, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు కోరుతామని మంత్రి తెలిపారు. నిందితులపై 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్ నియామకాలపై నిపుణులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

