Jaishankar: మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో ఈరోజు(బుధవారం) ఢిల్లీలో ఆల్ పార్టీ సమావేశం జరిగింది. ఇరాన్ యుద్ధం సమయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం, చమురు సంక్షోభం రాకుండా తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు తెలియజేసింది. అయితే, ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ‘‘దళాల్ దేశం’’ కాదని స్పష్టం చేశారు. పాక్ మధ్యవర్తిత్వం గురించి ప్రతిపక్షాలు ప్రశ్నించిన తర్వాత, ఈ విమర్శలకు జైశంకర్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. పాకిస్తాన్ను ‘‘బ్రోకర్ దేశం’’గా అభివర్ణిస్తూ.. భారతదేశం ఎవరి మధ్య మధ్యవర్తిత్వం చేయదని చెప్పారు. భారత్ తన దేశ అవసరాలను మాత్రమే పట్టించుకుంటుందని ప్రభుత్వం సూటిగా చెప్పింది.
ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్-యూఎస్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుందనే వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాక్ మధ్యవర్తిత్వం చేస్తుందనే వార్తలు వెలువడిన తర్వాత మోడీ సర్కార్పై కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. జైరాం రమేష్ వంటి వారు పాక్ మధ్యవర్తిత్వం చేస్తుంది, ఇండియా ఆ పని కూడా చేయలేకపోతుందని ఎద్దేవా చేశారు. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఇరాన్ అమెరికా మధ్య చర్చలకు ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఈరోజు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన వహించారు. ఇందులో హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి,విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి పాల్గొన్నారు. ప్రతిపక్షాలైన బీజేడీ నుంచి సస్మిత్ పాత్రా, జేడీయూ నుంచి లల్లన్ సింగ్, కాంగ్రెస్ నాయకులు ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, సమాజ్వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ హాజరయ్యారు.
