Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలకమైన ఆవిష్కరణ చేసింది. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుడికి సంబంధించిన కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడిపై నేల రెండు పొరలుగా వ్యాపించి ఉన్నట్లు తేలింది. పైపొర ధూళితో కప్పబడి ఉండగా, కింది పోర చాలా గట్టిగా మందంగా ఉన్నట్లు తేలింది. పైన ఉన్న ధూళి పొర కేవలం కొన్ని సెంటీమీటర్ల మందం ఉన్నట్లు వెల్లడైంది.
2023 సెప్టెంబర్ 2న చంద్రయాన్ 3 మిషన్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విక్రమ్ ల్యాండర్, ఉపరితలంపై దిగుతున్న సమయంలో దాని ఇంజన్లను మండించింది. దాని నుంచి వచ్చిన వేడి వాయువులు చంద్రుడి ఉపరితలంపై పైపొరలో ఉన్న ధూళి ఎగిరిపోయింది. దీంతో కింద బలమైన రాతి పొర బయటపడింది. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) శాస్త్రవేత్తలు ఈ డేటాను పరిశీలించిన తర్వాత, చిన్న చిన్న ఉల్కల నిరంతరం చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టడం వల్ల పలుచుగా, వదులుగా మారినట్లు తేలింది.
పైపొర దాదాపుగా 3-4 సెంటీమీటర్ల మందం, చాలా తేలికపాటి ధూళితో ఉంది. రెండో పొర 6.5 సెంటీమీటర్ల లోతులో పైపొర కన్నా రెండింతల సాంద్రత కలిగి ఉన్నట్లు తేలింది. పైపొర ఒక పొడి పిండిలా ఉంటే, కింది పొర తేమగా, గట్టిగా ఉండే మట్టిలా ఉంటుందని ఇస్రో తెలిపింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో చంద్రుడిపై వ్యోమనౌకల ల్యాండింగ్కు ఉపయోగపడటంతో పాటు భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనలకు గానూ స్థావరాలు నిర్మించుకునేందుకు ఉపయోగపడుతుంది.
