US NEWS: అమెరికాలో ఇటీవల ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి డ్యాన్స్ వైరల్ అయింది. డ్యాన్స్ వైరల్ అయితే గొప్పే కదా అని అనుకోవచ్చు, కానీ అతను డ్యాన్స్ చేసింది వాషింగ్టన్ డీసీలోని రెండో ప్రపంచ యుద్ధం స్మారక చిహ్నం వద్ద. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు ఎక్కువయ్యాయి. చివరకు ఇప్పుడు అతడి వీసాను రద్దు చేసి, దేశం నుంచి బహిష్కరించాలని యూఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మధురాజు అనే వ్యక్తి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాపై యూఎస్లో నివసిస్తున్నాడు. అతను ఒక మహిళతో వార్ మెమోరియల్ వద్ద డ్యాన్స్ చేశాడు. దీనిని టిక్టాక్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఈ వార్ మెమోరియల్ రెండో ప్రపంచయుద్ధం మరణించిన 4 లక్షల మందిని స్మరించుకుంటుంది. దీనిని గౌరవంగా చూస్తారు. అయితే, ఇలాంటి స్థలంలో డ్యాన్స్లు ఏంటని అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్ వైరల్ కావడంతో యూఎస్ అధికారులు దీనిపై దృష్టిసారించారు.
అమెరికన్ల త్యాగంతో ముడిపడి ఉన్న స్మారకం వద్ద అగౌరవంగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది టిక్టాక్కు వేదిక కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై చెడుగా చూపిస్తుందని మరొకరు కామెంట్ చేశారు. భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడటానికి 2.5 మిలియన్లకు పైగా సైనికులను పంపిందని మూడవ వ్యాఖ్యాత ఎత్తి చూపారు. ఇలాంటి ప్రదేశాలు టిక్టాక్ వేదిక కాదని చెప్పారు.
మధురాజు పాలో అల్టో నెట్వర్క్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థలో క్లౌడ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్గా పనిచేస్తున్నట్లు గుర్తించిన నెటిజన్లు, ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఇది వివాదాన్ని మరింత పెద్దది చేసింది. వివాదం పెద్దది కావడంతో ఈ వీడియోను తన వెబ్సైట్ల నుంచి మధురాజు తొలగించారు. అయితే, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాపై ఉన్న వ్యక్తి, ఒక గౌరవప్రదమైన వార్ మెమోరియల్ వద్ద క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు వీసా రద్దుకు దారి తీసే అవకావం ఉంది. ప్రస్తుతం అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి వీసా స్టేటస్ చెక్ చేస్తున్నారు. రాబోయే కొన్ని రోజుల్లో విచారణ తర్వాత అమెరికాలో ఉంటాడా.? బహిష్కరణకు గురవుతాడా? అనేది తేలుతుంది. మధురాజు ఈ ఘటనపై క్షమాపణలు చెప్పినప్పటికీ, అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.