Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!

  • కేంద్ర విద్యాశాఖ పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
  • దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన రాజీనామా
  • దేశ చరిత్రలో రాజీనామా చేసిన పలువురు కేంద్రమంత్రులు
Indai

Indai

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు జంతర్‌మంతర్ దద్దరిల్లింది. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున విద్యార్థులు చేపట్టిన ‘చలో సంసద్’ సందర్భంగా పోలీసుల లాఠీఛార్జ్ తర్వాత ఉద్యమం తీవ్రమైంది. దీంతో శనివారం కేంద్ర విద్యాశాఖ పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి రాజీనామా ఇదే కావడం విశేషం. ఇక ఆయా ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ దేశ చరిత్రలో అనేక మంది తమ పదవులకు రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తాజాగా ఆ మాజీ కేంద్రమంత్రుల రాజీనామాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు.

రాజీనామా చేసిన ముఖ్యులు వీరే.

లాల్ బహదూర్ శాస్త్రి

జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో రైల్వే, రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో 1956 నవంబర్ 23న తమిళనాడులోని అరియలూరు రైలు ప్రమాదం జరిగింది. వంతెన కూలిపోవడంతో ప్రయాణికుల రైలు నదిలో పడిపోయి దాదాపు 140 నుంచి 150 మంది మరణించారు. ఈ ప్రమాదానికి వ్యక్తిగతంగా బాధ్యత లేకపోయినా, నైతిక బాధ్యత తనదేనని భావించి శాస్త్రి రాజీనామా చేశారు. అంతకుముందు జరిగిన మరో రైలు ప్రమాదం తర్వాత కూడా ఆయన రాజీనామా చేయాలని భావించగా, నెహ్రూ అంగీకరించలేదు. కానీ అరియలూరు ప్రమాదం తర్వాత ఆయన రాజీనామాను అంగీకరించారు.

టీ.టి. కృష్ణమాచారి

ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎల్‌ఐసీ నిధులను పారిశ్రామికవేత్త హరిదాస్ ముంధ్రాకు చెందిన సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టిన ‘ముంధ్రా కుంభకోణం’ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని ఫిరోజ్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. వ్యక్తిగత అవినీతి ఆరోపణలు లేకపోయినా తన శాఖ పరిపాలనా వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కృష్ణమాచారి రాజీనామా చేశారు.

వీకే. కృష్ణ మెనన్

1962 భారత్-చైనా యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న వీకే. కృష్ణ మెనన్‌పై భారత సైన్యం సిద్ధతలో లోపాలున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. యుద్ధంలో భారత్‌కు ఎదురైన పరాజయాల అనంతరం తీవ్ర రాజకీయ ఒత్తిడి మధ్య కృష్ణ మెనన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

నితీశ్ కుమార్

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ హయాంలో 1999 ఆగస్టు 2న పశ్చిమ బెంగాల్‌లోని గైసాల్ దగ్గర రెండు రైళ్లు ఢీకొని 280 మంది ప్రాణాలు కోల్పోయారు. సిగ్నలింగ్, నిర్వహణలో వైఫల్యాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తేలడంతో నితీశ్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.

శివరాజ్ పాటిల్

2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రదాడుల అనంతరం కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిఘా వ్యవస్థ, తీర భద్రత, అత్యవసర స్పందనలో లోపాలు బయటపడటంతో నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేశారు.

విలాస్‌రావు దేశ్‌ముఖ్

26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విలాస్‌రావు దేశ్‌ముఖ్ కూడా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అనంతరం నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

మమతా బెనర్జీ

2001లో రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ఆమె రాజీనామాను ఆమోదించలేదు.

సురేష్ ప్రభు

2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సురేష్ ప్రభు హయాంలో వరుస రైలు ప్రమాదాలు జరిగాయి. దీంతో 2017లో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రతిపాదించారు. అయితే ప్రధాని మోడీ ఆయన రాజీనామాను తిరస్కరించారు. అనంతరం జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పీయూష్ గోయల్‌కు రైల్వే శాఖ బాధ్యతలు అప్పగించారు.

ధర్మేంద్ర ప్రధాన్‌పై ఒత్తిడి

ఇక తాజాగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవ్వడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. శనివారం కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన పన్నెండేళ్ల తర్వాత ఓ కేంద్రమంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.