India Receives Good News Amid Conflict: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య భారత్కు శుభవార్త అందింది.. హార్మూజ్ జలసంధి ద్వారా రెండు కీలకమైన వాణిజ్య నౌకలు, పెట్రోలియం ఉత్పత్తులను తీసుకువెళ్తూ, త్వరలో భారత్కు చేరనున్నాయి. ఈ నౌకల భద్రతను నిర్ధారించడానికి భారత నౌకాదళం పూర్తి అప్రమత్తతతో పని చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడుల కొనసాగుతోన్న వేళ ఈ సముద్ర మార్గంలో నౌకలు సురక్షితంగా ప్రయాణించటం భారతదేశానికి ముఖ్యమైన విజయంగా పేర్కొనవచ్చు.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ విషయాన్ని ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు, గల్ఫ్ ప్రాంతంలో గత 24 గంటల్లో భారతీయ నౌకలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లో సుమారు 20 భారత జెండా నౌకలు పనిచేస్తున్నాయి, వీటిలో దాదాపు 540 మంది భారతీయులు ఉన్నారు.. వీరందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ 24×7 కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. గత 24 గంటల్లో ఈ కేంద్రానికి 98 కాల్స్ మరియు 335 ఇమెయిల్స్ వచ్చాయి.. వాటికి వెంటనే రిప్లే ఇచ్చాం.. దీనిపై ప్రభుత్వం, సంబంధిత ఏజెన్సీలు సక్రమంగా, ముందుచూపుతో వ్యవహరిస్తున్నాయని తెలిపారు..
విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పశ్చిమ ఆసియాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. సముద్ర మార్గంలో సురక్షితమైన నౌకాయానం కోసం భారత్ అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నది. ఇటీవల LPG సరఫరా కోసం ప్రయాణించిన నాలుగు భారతీయ నౌకలు విజయవంతంగా జలసంధి గుండా చేరిన విధానం కూడా ఇదే వ్యూహానికి అద్భుతమైన ఉదాహరణగా చెప్పవచ్చు.. ఈ పరిణామం భారతదేశానికి కీలకమైనది.. ఎందుకంటే, ఇంధన సరఫరాలను సురక్షితంగా ఉంచడం ద్వారా దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం తక్కువవుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, భారత్ చురుకైన వ్యూహంతో తన ఇంధన అవసరాలను పూర్తి చేయగలుగుతోంది.
