Site icon NTV Telugu

India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

Oil Crisis

Oil Crisis

India Oil Reserves: ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయిల్ దాడులు మధ్యప్రాచ్యాన్ని ఉద్రిక్తతల్లోకి నెట్టాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం తర్వాత ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైయిన్ వంటి దేశాలకు కూడా విస్తరించింది. ఇరాన్ ఈ దేశాల్లోని అమెరికన్ స్థావరాలపై మిస్సైల్స్, డ్రోన్లలో దాడులకు తెగబడుతోంది. దుబాయ్, దోహా, అబుదాబీ వంటి సిటీలపై దాడులు చేస్తోంది.

హార్ముజ్ జలసంధి మూసివేత, చమురు రవాణాకు ఇబ్బందులు:

ఇదిలా ఉంటే, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. ఇది భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గల్ఫ్ నుంచి వచ్చే చమురు ఈ మార్గం ద్వారానే రావాల్సి ఉంటుంది. ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుంటుంది.ఈ మార్గం గుండా వచ్చే చమురు ఎగుమతుల్లో 82 శాతం ఆసియాకు వెళ్తున్నాయి. ఇందులో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వాటా ఏకంగా 67 శాతం ఉంది. భారత్ ముడి చమురులో 90 శాతం చమురును మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40 శాతం హార్మూజ్ జలసంధి నుంచే వస్తున్నాయి.

భారత్ దగ్గర రోజులకు నిల్వలు ఉన్నాయి?

పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పిన వివరాల ప్రకారం, ఏదైనా సంక్షోభం తలెత్తితే భారత్ వద్ద 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. అయితే, మొత్తం పెట్రోలియం నిల్వల్ని 90 రోజులకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని భూగర్భంలోని గుహాల్లో భద్రపరిచిన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ (SPR) సుమారుగా 9.5 రోజులకు సరిపోతుంది. దీనికి తోడు చమురు మార్కెటింగ్ కంపెనీల వద్ద అందుబాటులో ఉన్న ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం సుమారుగా 67 రోజులకు సరిపడా ఉంది.

ఒక బారెల్ ధర ఒక డాలర్ పెరిగితే భారత్ ఏడాదికి 1.4 బిలియన్ డాలర్లు అదనపు ఖర్చు భరించాల్సి వస్తుంది. దీనికి తోడు గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. భారత్ తన అవసరాలకు అవసరమైన గ్యాస్‌లో 50 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం, హార్ముజ్ జలసంధి మూతపడినా, రష్యన్ ఆయిల్ భారత్‌కు అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనితోడు వెనిజులా ఆయిల్ కూడా భారత్ కొనుగోలు చేస్తోంది. ఇప్పటికప్పుడు భారత్‌కు వచ్చే ఇబ్బందులు లేవు, కానీ దీర్ఘకాలం హార్ముజ్ జలసంధి మూతపడితే మాత్రం చమురు ధరలు పెరిగే అవకాశ ఉంది.

Exit mobile version