POK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, పాకిస్తాన్ను తాను చేస్తున్న దుర్మార్గాలకు అంతర్జాతీయ సమాజం ముందు జవాబుదారీగా నిలబెట్టాలని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయని ఆరోపించారు. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ఇలాంటి ప్రచారానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. పాక్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.
ఇటీవల పీఓకేలోని రావల్కోట్లో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పాక్ ప్రభుత్వం, ఆర్మీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అయితే, వీటిని పాక్ ఆర్మీ అణిచివేసే ప్రయత్నాలు చేసింది. నిరసనకారులు, భద్రతా బలగాలకు మధ్య హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించగా, 200కి పైగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను బట్టి చూస్తే మృతుల సంఖ్య వందల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. పీఓకే ప్రజలు తుపాకులు, పెట్రోల్ బాంబులతో తమపై దాడులు చేస్తున్నారని పాక్ భద్రతా బలగాలు ఆరోపిస్తున్నాయి.
పీఓకే ప్రజల్ని పాక్ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం, పీఓకే వనరుల్ని పంజాబ్ తరలించడం, పీఓకే ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీలు మోపడం వంటివి చేస్తోంది. దీంతో ఈ అణిచివేత, అక్రమాలపై పీఓకే ప్రజలు తిరగబడుతున్నారు. తమకు స్వాతంత్య్రం కావాలని నినదిస్తున్నారు. మరోవైపు, ఈ అల్లర్లు పీఓకేలోని మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిట్ బాల్టిస్తాన్, దద్యాల్, రావల్కోట్, సుధ్నోటి, తట్టాపాని ప్రాంతాలకు విస్తరించాయి. మొబైల్ ఇంటర్నెట్ను పాక్ ప్రభుత్వం నిలిపేసింది. ఈ దమణకాండపై బ్రిటిష్ ఎంపీలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

