NTV Telugu Site icon

PM Modi: ఇండియా కూటమి ముస్లిం ఓట్ల కోసం ‘బానిసత్వం’ చేస్తుంది.

Pm Modi

Pm Modi

PM Modi: కాంగ్రెస్, ఆర్జేడీ, ఇండియా కూటమిలోని పలు పార్టీలను టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఫైర్ అయ్యారు. ఈ రోజు బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి బానిసత్వం చేస్తుందని ఆరోపించారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను దోచుకునే ప్రయత్నాలను అడ్డుకుంటానని ఆయన అన్నారు. పాటలీపుత్ర లోక్ సభ స్థానంలో ఆయన బీజేపీ అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు. బీహార్‌లోని మైనారిటీ సంస్థల్లో ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ వర్గాలు కోటాలను కోల్పోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను నిందించారు.

Read Also: Baby Leaks: సాయి రాజేష్ ‘బేబి’ కాపీ.. సాక్ష్యాల‌తో ‘బేబీ లీక్స్’ బుక్.. దర్శకుడు సంచలనం!

‘‘సామాజిక న్యాయం కోసం దిశానిర్దేశం చేసే భూమి బీహార్. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ హక్కులను దోచుకోవడానికి, వాటిని ముస్లింలకు మళ్లించడానికి ఇండియా కూటమి ప్లాన్ చేస్తోంది. వారు బానిసలుగా ఉండీ తమ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకుంటున్నారు. నేను దానిని భగ్నం చేస్తాను’’ అని ప్రధాని అన్నారు. ప్రతిపక్ష కూటమి ‘‘ఓట్ జిహాద్’’ మునిగితేలుతుందని విమర్శించారు. ముస్లింలను ఓబీసీలో చేర్చలనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టేసిన ఉత్తర్వులను ప్రధాని ప్రస్తావించారు. చాలా మందికి రాముడితో గొడవ ఉందని, వారు రామ్ కృపాల్ పేరు కూడా విస్మరించవచ్చు అని బీజేపీ ఎంపీ పేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.

జూన్ 4 తర్వాత లడ్డూలు సిద్ధం చేసుకోవాలని, ఇది మీ ఎంపీని ఎన్నుకన్నందుకు మాత్రమే కాదని మీ పీఎం కోసమని ఆయన అన్నారు. ఎల్‌ఈడీ బల్బుల యుగంలో బీహార్ మొత్తాన్ని చీకట్లో ఉంచి తమ ఇంటిని మాత్రమే వెలిగించే లాంతరుతో తిరుగుతున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను పేరు ప్రస్తావించకుండా ప్రధాని మోదీ ఎగతాళి చేశారు.లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు మిసా భారతి పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, సమాజ్ వాదీ పార్టీలు కుటుంబ పార్టీలని విమర్శించారు. మెరుగైన విద్యుత్ సరఫరాతో పాటు మరిన్ని పక్కా గృహాలతో బీహార్‌లో వేగంగా అభివృద్ధి చెందుతుందని, రాబోయే ఐదేళ్లపాటు తాను అధికారంలో ఉంటానని ప్రధాని ప్రజలకు హామీ ఇచ్చారు.