NTV Telugu Site icon

IMF meeting: పాకిస్తాన్‌కి ఐఎంఎఫ్ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వొద్దు.. ఓటింగ్‌కి దూరంగా భారత్..

Imf

Imf

IMF meeting: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కి అందించే బెయిలౌట్ ప్యాకేజీని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. గతంలో పాకిస్తాన్‌కి ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసిందని, భారత్ తన ఆందోళనను వ్యక్త పరిచింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఐఎంఎఫ్ నిధులను దుర్వినియోగం చేస్తుందని చెప్పింది. పాకిస్తాన్ భారీ రుణభారం, ఆర్థిక వ్యవస్థల్లో పాక్ ఆర్మీ జోక్యాన్ని భారత్ ఐఎంఎఫ్ ముందు లేవనెత్తింది. ప్రపంచ ఆర్థిక విధానాలలో నైతిక పరిశీలనల అవసరాన్ని భారతదేశం నొక్కి చెప్పింది.

Read Also: Mohan Bhagwat : ఆపరేషన్ సిందూర్ దేశ గౌరవాన్ని పెంచింది.. ఆర్ ఎస్ ఎస్ చీఫ్‌ ప్రకటన

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పాకిస్తాన్‌కు ప్రతిపాదించిన 1.3 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీపై భారతదేశం ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మందిని చంపేయడం, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.

మే 9న వాషింగ్టన్‌లో జరిగిన IMF బోర్డు సమావేశంలో, IMF సహాయానికి సంబంధించిన షరతులను పాకిస్తాన్ పదేపదే పాటించడంలో విఫలమైందని భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌కి ఆర్థిక సహాయం పరోక్షంగా సైనిక నిఘా కార్యకలాపాలకు, భారతగడ్డపై దాడులకు కుట్ర పన్నడానికి లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలకు మద్దతు ఇస్తుందని భారత్ చెప్పింది. సీమాంతర ఉగ్రవాదం అంతం చేయడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోని పాకిస్తాన్‌కి ఆర్థిక సాయం అందించడంలో జాగ్రత్త వహించాలని భారత్ కోరింది.