IMD Rain Alert: ఈ రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

  • ఉత్తర భారత రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
  • అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్
  • అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Rainalert

Rainalert

దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం నుంచి మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ.. ఉత్తర భారత రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శశికాంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు.

డాక్టర్ శశికాంత్ మాట్లాడుతూ.. ‘‘వాయువ్య భారతదేశంలోని జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. రేపు కూడా ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది.’’ అని తెలిపారు. అలాగే జమ్మూకశ్మీర్‌తో పాటు సమీప ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. మైదాన ప్రాంతాల విషయానికి వస్తే.. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

తూర్పు రాజస్థాన్‌లో ఈరోజు నుంచి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డాక్టర్ శశికాంత్ వివరించారు. దేశంలో రుతుపవనాల పురోగతిపై మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. అయితే వచ్చే మూడు రోజుల్లో అక్కడికి కూడా రుతుపవనాలు విస్తరించి, దేశమంతా పూర్తిగా కప్పివేస్తాయి.’’ అని డాక్టర్ శశికాంత్ వెల్లడించారు.

మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, పూణె జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక అతి భారీ వర్షాలు కారణంగా ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు.