IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు

  • దేశ వ్యాప్తంగా రుతుపవనాలు
  • పలు రాష్ట్రాలకు భారీ వర్షాలు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
Imd

Imd

దేశవ్యాప్తంగా రుతుపవనాలు మరోసారి పుంజుకోనున్నాయి. మధ్య భారతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతుండటంతో గురువారం దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

మంగళవారం ఉదయం మధ్య ఛత్తీస్‌గఢ్‌పై కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం.. రానున్న 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా మరింత పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వాతావరణ వ్యవస్థ చురుకైన రుతుపవన ద్రోణితో కలిసి పనిచేయడం వల్ల మధ్య, పశ్చిమ, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. జూలై 30న పశ్చిమ మధ్యప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో గురువారం దేశంలో పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రధాన వర్ష ప్రభావిత ప్రాంతంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

తూర్పు మధ్యప్రదేశ్, గుజరాత్, కొంకణ్-గోవా, మహారాష్ట్ర, కర్ణాటక తీర ప్రాంతాలు, అంతర్గత కర్ణాటక, కేరళ, తెలంగాణ, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం-మేఘాలయ, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఢిల్లీ, జమ్ముకశ్మీర్, లడఖ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరితో పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

భారీ వర్షాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మహారాష్ట్ర, కేరళ, కోస్తాంధ్ర, అంతర్గత కర్ణాటక, కొంకణ్-గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్‌లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

గత 24 గంటల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా-ఢిల్లీ, తూర్పు రాజస్థాన్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా ఉండటంతో రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత కొనసాగవచ్చని ఐఎండీ అంచనా వేసింది.